headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-14 | December 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. బాడిశ హనుమంతరావు ఈనాడు దినపత్రిక కథలు: కుటుంబసంబంధాలు

వడగూరు సంపత్ కుమార్

తెలుగు & తులనాత్మక సాహిత్య శాఖ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం,
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9177744817, Email: sampathkumaryadav777@gmail.com



ఆచార్య డా. జి. నరసింహన్

ఆచార్యులు, తెలుగు & తులనాత్మక సాహిత్యశాఖ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం,
అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9000127115, Email: gnnnaga11@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.11.2024        ఎంపిక (D.O.A): 28.11.2024        ప్రచురణ (D.O.P): 01.12.2024


వ్యాససంగ్రహం:

ప్రస్తుతకాలంలో యువత ఆలోచనలు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. వారికి ఏదైనా విషయాన్ని తెలియజేయాలంటే దీర్ఘంగా కాకుండా సూక్ష్మంగా చెప్పవలసిన అవసరం ఏర్పడింది. హితాన్ని కూర్చేది సాహిత్యం అన్నారు పెద్దలు. హితాన్ని బోధించే సాహిత్య ప్రక్రియలో కథానిక ఒకటి. ఈ కథానికలను ప్రస్తుతం దిన, వార, మాసపత్రికలు ప్రచురించడం గమనిస్తున్నాం. అలాంటి పత్రికలలో ఈనాడు దినపత్రిక ప్రతి ఆదివారం ఒక సంచికను అందిస్తుంది. అందులో పిల్లలు నుంచి ముసలివారి వరకు అందరినీ ఆకట్టుకునే విధంగా అన్ని విశేషాంశాలను ప్రచురిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం ఒక కథను సంచికలో ప్రచురించడం జరుగుతుంది. ఇందులో మానవ సంబంధాలు, కుటుంబసంబంధాలు, మధ్యతరగతి మనస్తత్వాలు ఇలా ప్రతి అంశానికి సంబంధించిన కథలు వస్తున్నాయి. అలా వచ్చిన కథలలో సర్దుబాటు, చూడు నాన్న!, అనగనగా ఓ సలహా… ఈ కథలు తెలంగాణ,సూర్యపేట జిల్లా, కోదాడ మండలం కాపుగల్లు ప్రాంతానికి చెందిన రచయిత బాడిశ హనుమంతరావు వ్రాశారు. ఈయన రచించిన చాలా కథలు సాక్షి, వెలుగు, నా తెలంగాణ, అంతర్జాలంలో కథామంజరిలో కనిస్తాయి. నేను వ్యాసానికి ఎంచుకున్న కథలలో కుటుంబ సంబంధాల గురించి చెప్పారు. ఇతివృత్తంలోని పాత్రల ద్వారా రచయిత చెప్పదలుచుకున్న అంశాన్ని ఏ విధంగా చెప్పారు, అలాగే ఈ మూడుకథలను విశ్లేషణపద్ధతిలో ఉన్న వాటిని సంశ్లేషణ చేసి అవగాహన చేసుకుంటాం. అలాగే పూర్వపరిశోధనల్లో రెడ్డి శెట్టి అనురాధ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఈనాడుదినపత్రికలోని కథానికలపై (2001-2010); ఏలూరు అశోక్ కుమార్ ఆంధ్ర విశ్వకళాపరిషత్, ఈనాడు దినపత్రిక కథానికలపై(2010-2015) పరిశోధన గ్రంధాలను సమర్పించడం జరిగింది.

Keywords: ఈనాడు, దినపత్రిక, సాహిత్యం, కుటుంబసంబంధాలు, సర్దుబాటు, సంగ్రహం, స్వభావం

1. పరిచయం:

ఆధునిక సాహిత్య ప్రక్రియలో కథానిక ఒకటి.‘ ఏకాంశ వ్యగ్రమైన, స్వయం సమగ్రమైన, కథాత్మక వచన ప్రక్రియ కథానిక’1.  ప్రస్తుతం  ఈ ప్రక్రియ ప్రజలలోకి వెళ్లడానికి ప్రధాన వాహకం పత్రికా రంగం అని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది 'ఈనాడు దినపత్రిక'. ఈ పత్రిక రామోజీరావు గారిచే ఉషోదయపబ్లికేషన్ పేరుతో 1974 సంవత్సరంలో ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ పత్రికకు ప్రారంభసంపాదకుడు ఏబికే ప్రసాద్. పత్రిక ప్రారంభంలో ఐదువేల కాపీలతో మొదలయ్యింది. తరువాత 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో రెండో ప్రచురణ కేంద్రంను ఏర్పాటు చేశారు. ఈనాడు పత్రిక, ప్రారంభమైంది మొదలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త హంగులతో పాఠకులలో ఆసక్తిని రేకిస్తూ అన్ని విధాలా ముందడుగు వేస్తుంది. 'కథానిక నేటి సమాజానికి దర్పణం పట్టుచున్నది'2 అంటారు ఆచార్య జి. నాగయ్య.  ఆదివారం అనుబంధంలో భాగంగా కొంతమంది ఆధునికరచయితలు కథానికలు రాస్తున్నారు. అలాంటి వారిలో బాడిశ హనుమంతరావు ఒకరు. ఈయన రాసిన మూడుకథలను ఎంచుకొని అందులోని కుటుంబ సంబంధాలను చిత్రించిన తీరును పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

2. ఈనాడు అనుబంధ సంచిక - కథ ప్రస్తావన:

సమాచారంచేరవేత సాధనంగా ప్రారంభమైన పత్రిక, వర్తమాన అంశాలతో పాటుగా ప్రత్యేక ఫీచర్లు కథనాల్ని ప్రచురించి పాఠకులకు వార్తలతో పాటు మంచి మంచి విషయాలను కూడా అందిస్తుంది. ఈ పత్రికలో ప్రచురితమైన అనేక ఫీచర్లు ప్రత్యేక వార్తాకథనాలు సాహిత్యస్థాయిని సంతరించుకున్నాయి. పాఠకులకు ముఖ్యంగా 1988వ సంవత్సరం ఫిబ్రవరి 28 నుండి రంగుల బొమ్మలతో ఆకట్టుకునే కవర్ పేజీతో ఆదివారం మ్యాగజైన్ అనుబంధాన్ని ప్రారంభించింది. ఆదివారం అనుబంధం ముఖచిత్రం రంగుల ఫోటోలతో ప్రచురించబడుతుంది. ఆ ఫోటోలు సంచికలోని మొత్తం అంశాలకు ప్రతిబింబంగా ఉంటాయి. ఇందులో భాగంగా ఒక కథ ప్రచురించబడుతుంది. ఈ కథ స్థానంలో గతంలో నమ్మలేని నిజాలు పేరుతో భారతదేశానికి సంబంధించిన లేదా ప్రపంచంలో ఇతర దేశాలకు సంబంధించిన ఒక క్రైమ్ స్టోరీ ప్రచురించబడేది.

3. కథలు:

ఆదివారం అనుబంధంలో తప్పనిసరిగా ఒకకథను ప్రచురిస్తున్నారు. ఇందులో భాగంగా బాడిశ హనుమంతరావు మూడుకథలలో కుటుంబసంబంధాల చిత్రణ గురించి ఏకాంశంగా చేసుకొని పరిశీలించడం జరిగింది. 1) సర్దుబాటు. 2) చూడు నాన్నా! 3) అనగనగా ఓ సలహా.

3.1 సర్దుబాటు: 

ఈ ఈ కథ 2018 నవంబర్ 11 న ఆదివారం సంచికలో ప్రచురించబడింది.

3.1.2 కథ సంగ్రహం:

సర్దుబాటు కథలో ప్రధాన పాత్రలు చక్రవర్తి మరియు విహారి. చక్రవర్తి కుమారుడే విహారి. విహారి తన తండ్రి చెప్పినట్టుగా నడుచుకొని జీవితంలో ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడతాడు. ఉద్యోగం మైసూర్లో చేస్తుంటాడు. చక్రవర్తి మాత్రం తన స్వగ్రామంలోనే ఉంటాడు. తన సహచర రైతులకు పొరుగు వారికి చేతనైన అన్ని సహాయ సహకారాలు అందిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ రకమైన ప్రవర్తన తన కుమారుడికి నచ్చేది కాదు. సాయం చేయడం మంచిదే కానీ ‘అందరూ మంచివాడు అనుకోవాలన్న ఆలోచన కూడా ఒక జబ్బు లాంటిది అనిపిస్తుంది విహారికి’.3 అలాగే తన తండ్రిచే ఆర్థికసాయం పొందిన వారు తిరిగి ఇవ్వకపోవడం తన తండ్రి వసూలు చేసుకోలేకపోవడం నచ్చేది కాదు విహారికి.

కొంతకాలానికి చక్రవర్తి మరణించడం జరుగుతుంది. కుటుంబంలో విహారి, నాన్న ఇరువురు మాత్రమే ఉండేవారు.. ఇప్పుడు తండ్రి మరణించడంతో ఒంటరివాడైపోయాడు విహారి. చక్రవర్తి తన గ్రామ ప్రజలకు చేసిన సాయం విహారిని ఒంటరిని చేయనివ్వదు. తన తండ్రి లేని లోటును కానరానివ్వదు ఆ గ్రామం. తన తండ్రి చేసిన గొప్ప పనులే ఇప్పుడు విహరిని ఒంటరిని చేయనివ్వలేదు.

3.1.3 కథ సమీక్ష:

ఈ కథలో కుటుంబ జీవనానికి సంబంధించిన రెండు ప్రధానమైన అంశాలను ఇతివృత్తంగా తీసుకున్నారు. అవి ఒకటి తండ్రీ కొడుకుల మధ్య ప్రేమానురాగాలా సంబంధం. రెండోది గ్రామాలలో మానవ సంబంధాలు. రెండింటిలోనూ సంబంధ బాంధవ్యాలు అనేవి కామన్ అని చెప్పవచ్చు. అయితే కుటుంబంలో ఒక తండ్రి నిర్వర్తించాల్సిన పాత్రను గురించి చక్కగా నిర్వహించారు. చక్రవర్తి తన కుమారుడిని ప్రయోజకుడిగా మార్చి  కుటుంబంలో తన పాత్రను  పూర్తి చేస్తాడు. అలాగే తన చుట్టూ ఉన్న గ్రామ ప్రజలందరితో ఎంతో మంచిగా ఉండి మానవ ధర్మాన్ని పాటిస్తాడు. మానవుడు సంఘజీవి ఒంటరిగా జీవించలేడు. ప్రపంచంలో ఏ శిశువు అయినా మొదట పాఠాలు నేర్చుకునేది కుటుంబంలోనే. తరువాతనే సమాజంలోకి ప్రవేశిస్తాడు. కుటుంబం ద్వారా నేర్చుకోలేని ఎన్నో అంశాలను సమాజంలోని సభ్యుల ద్వారా అనగా ఇరుగుపొరుగువారు, స్నేహితులు ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. కుటుంబం లేని పక్షంలో సమాజంమే ఒక కుటుంబంగా ఉంటుంది. ఇది తెలుసుకున్న గొప్ప వ్యక్తి చక్రవర్తి. విహారికి తన తండ్రి మరణవార్త విన్నప్పుడు తన తండ్రి చివరి చూపు కోసం చేసిన ఒంటరి ప్రయాణం. విహారి తిరిగి వెళ్ళేటప్పుడు ఒంటరిని చేయనివ్వలేదు ఆ గ్రామం. తిరుగు ప్రయాణంలో తన తండ్రి చెప్పిన 'తప్పులు ఎంచి దూరం పెడితే మన పక్కన ఎవరూ ఉండరు అలా కాక కాస్త సహనం చూపితే అందరూ మనవారే మన కుటుంబంలోని వారే’4 అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి విహారి కళ్ళల్లో నీటి సుడి గుండెల్లో అనురాగపు జడి.

3.1.4 రచన విశేషాలు:

కుటుంబ జీవనంలోని తండ్రి కొడుకులు, అలాగే గ్రామ ప్రజల మధ్య అభిమానాలు, త్యాగాలు, కర్తవ్యాలు అంశాలను ఇతివృత్తంగా తీసుకొని అద్భుతంగా ఈ కథను రాశారు. ముఖ్యంగా చక్రవర్తి పాత్ర ద్వారా మానవుడు ఒంటరిగా కన్నా సాంఘికంగానే ఎంతో అభివృద్ధి చెందుతాడని తెలియజేశారు.

3.2 చూడు నాన్నా!

ఈ కథ 2018 నవంబర్ 11 న ఆదివారం సంచికలో ప్రచురించబడింది.

3.2.1 కథ సంగ్రహం:

చూడు నాన్న శీర్షికతో వచ్చిన కథలో ప్రధాన పాత్రలు నాన్న, మల్లికా, మహిక,  అవినాశ్. కథ ప్రారంభంలో మొత్తం తండ్రి కూతురి మధ్య చుట్టూ తిరుగుతుంది. కథ మధ్యలో కూతురు అల్లుడి మధ్య జరుగుతుంది కథ ముగింపులో తిరిగి తండ్రి కూతుర్ల మధ్య ఉండే ప్రేమానురాగాలను శిఖర స్థాయిలో చూపించడం జరిగింది.

తన కూతురు జన్మించినప్పుడు మొదటిసారిగా తన చేతుల్లోకి బిడ్డను తీసుకున్న క్షణం తన జీవితంలో ఎంతో గొప్ప సమయంగా అనుకుంటాడు నాన్న. అలాగే కూతురు పుట్టినది మొదలు తన ప్రవర్తనలో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కూతుర్ని బాగా చూసుకోవాలని కష్టపడి పనిచేసి ఆర్థికంగా బాగా ఎదుగుతాడు. తన తండ్రి ఎంత చెబితే అంత మహికి. తండ్రి చెప్పినట్టుగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుంటుంది మహి. అమ్మనాన్న చెప్పినట్టుగానే వారు తీసుకుని వచ్చిన అవినాశ్ అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయం జరుగుతుంది. పెళ్లి నిశ్చయం తర్వాత మహిక ప్రవర్తనలో మార్పు రావడం, నాన్న బాధపడడం, చివరలో తన తండ్రి వద్దకు వచ్చినా ‘కూతుర్ని చూసి పెళ్లి అయినంత మాత్రాన మా అమ్మ కాకుండా పోతుందా? అమ్మలాంటి  కూతుర్ని మురిపెంగా చూస్తూ’5 అనుకోవడంతో కథ ముగుస్తుంది.

3.2.2 కథ సమీక్ష:

చూడు నాన్న కథలో ప్రధానంగా తండ్రీ కూతుర్ల మధ్య సంబంధాన్ని చాలా చక్కగా చిత్రించారు. కథలో మొదటగా కూతురు పుట్టిన సందర్భం నుంచి మొదలవుతుంది భార్య పుట్టింటికి పురుడు కోసం పోతుంది. భార్య ఇంటి వద్ద నుంచి ఒక రోజు ఉదయం 'మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందోయ్'6 అనే వార్తతో కథ ప్రారంభమవుతుంది. అది విన్న వెంటనే ప్రాణం ఆగలేదు తన బిడ్డను చూసేదాకా తండ్రికి. కూతురిని చూసిన క్షణం నుండి మహారాణిలా చూసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఇంట్లో ఆడపిల్ల పుడితే సంపాదన మెరుగుపరుచుకోవాలని అలాగే ఇతరులతో వ్యవహరించే పద్ధతిని కూడా మార్చుకోవాలని చెప్పారు. తన కూతురు ఉద్యోగం తెచ్చుకోవడం తాము చెప్పిన సంబంధానికి పెళ్లికి ఒప్పుకోవడం జరుగుతుంది. పెళ్లి నిశ్చయం అయినప్పటి నుండి మహికా ప్రవర్తనలో మార్పు తండ్రిని బాధపెడుతుంది 'నాన్న నీకు నచ్చింది ఏదైనా చెయ్ ఏదైనా తీసుకో'అనే స్థితి నుంచి 'నీకెందుకు' నాన్న ఈ వయస్సులో అనే మాట తండ్రిని ఎంతో బాధకు గురిచేస్తుంది.

మహికకు అవినాశ్ తో పెళ్లి జరుగుతుంది. మహిక మెడలో మూడు ముళ్ళు కడుతున్న సందర్భంలో గట్టిమేళం వాయిస్తుంటే తండ్రి గుండెలో ఒక భాగాన్ని పెళ్లి పేరుతో లాగేసుకుంటున్నారు అన్నట్టుంటుంది తండ్రికి. మూడు ముళ్ళు, గట్టిమేళం, అక్షింతల వర్షంతో తన కూతురు తనకు దూరమైపోయిందని బాధతో భార్య మల్లికతో ఇంటికి వచ్చేశాడు. తన కూతురు తన ఇంట్లో లేదు. రోజు వేసే అడుగులే రోజు చూస్తున్న ఇల్లే కానీ చాలా భారంగా ఉంది తండ్రికి తన కూతురు ఇప్పుడు పరాయి వాళ్ళ ఇంట్లో ఉంది.  ఉదయం పెళ్లి కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఆనకట్ట వేసి ఆపిన ఆ కన్నీటి వరద గట్టు తెగిన దానికి మల్లె  వెల్లువైంది. ఇది గమనించిన మల్లిక తన భర్త చేతిలో కాఫీ కప్పు పెడుతూ 'చాల్లే సంబడం చిన్నపిల్లడిలా ఏంటా ఏడుపు ఎవరైనా చూస్తే నవ్విపోతారు'7 అంది. మనలాగే వాళ్లు కూడా వారిదైన జీవితం నిర్మించుకుంటారు అందులోను మన కూతురు స్వతంత్ర భావాలు కలిగి ఉద్యోగం చేస్తుంది. ఇప్పటివరకు మన కూతురు తల్లిదండ్రులు ప్రేమను పొందింది ఇప్పుడు తన భర్త ప్రేమను పొందాల్సిన సమయం వచ్చింది అంతే.

నూతన దంపతులు ఇంటికి రావడంతో కథ చివరి దశకు వస్తుంది. తన కూతురు మూడో రోజుకి ఇంటికి వస్తున్న ఎన్నో ఏళ్లకు వస్తున్నట్లు ఉంటుంది తండ్రికి తన కూతురు ఇంటి ప్రాంగణంలో ప్రవేశిస్తుందనే విషయం తెలుసుకుని గబుక్కున లేచి పెద్ద అడుగు వేసే సందర్భంలో కాలుజారి క్రింద పడ్డాడు అది చూసి నాన్న..! అంటూ ఒక్క దూకు దూకింది మహిక. తన తండ్రి భుజాల కింద చేయి వేసి పైకి లేపింది. తన కూతురి స్పర్శతో సలుపులు పెడుతున్న మనస్సు నొప్పి అంతా దూదిపింజలా తేలిపోయింది. నాకు పెళ్లి అయినప్పటినుండి మీరు ఫోన్ చేస్తారేమో అని చేతిలోనే పట్టుకుని కూర్చున్నా, ఫోన్ చేద్దాం అనుకున్న కానీ నేను ఏడ్చేస్తానేమో మీరు కంగారు పడతారేమో అని ఉగ్గపట్టుకున్నాను అని ఏడుస్తున్న మహికానీ చూసి 'బుంగమూతి వేసుకొని అడుగుతున్న చిన్ననాటి మహికా జ్ఞాపకం వచ్చింది'అయినా పెళ్లయినంత మాత్రాన మా అమ్మ అమ్మ కాకుండా పోతుందా అమ్మలాంటి కూతుర్ని మురిపెంగ చూస్తూ అనుకున్నాడు తండ్రి.

3.2.3 రచన విశేషాలు:

రచయిత కథను తండ్రి కూతుర్ల మధ్య ఉండే ప్రేమను ఎంతో చక్కగా వివరించారు. సాధారణంగా పిల్లలు ఎవరైనా సరే భయపెట్టే వారిని చూసి నాన్నకు చెప్తా అనడం సహజం కానీ అమ్మాయికి సంతోషం ఆనందం మరియు సిగ్గు సమయాలలో ' చూడు నాన్న'  అని అనడం సాధారణంగా చూస్తుంటాం. ఈ మాటనే కథ శీర్షికగా నిర్ణయించడంతోనే కథ మొత్తం తండ్రి కూతురు మధ్య జరుగుతుందని చెప్పడం జరిగింది.

3.3 అనగనగా ఓ సలహా...:

ఈ కథ 2020 మే 31 ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురించబడింది.

3.3.1 కథాసంగ్రహం:

అనగనగా ఓ సలహా శీర్షికతో వచ్చిన కథలో ప్రధాన పాత్రలు ముత్యాలరావు, రాంబాబు, రమణి. కథ ప్రారంభం ముత్యాలరావు గారి అల్లుడిగా రాంబాబు ప్రవేశం జరుగుతుంది. మధ్యవర్తి ద్వారా తన కూతురికి రాంబాబుల మధ్య వివాహం జరుగుతుంది రాంబాబు ప్రవర్తన మీద కూడా ముత్యాలరావు గారికి మంచి అభిప్రాయం ఉంది. వివాహం జరిగిన పది రోజుల తర్వాత అల్లుడి వెంట తన కూతురిని పంపే ముందు రోజు మామ అల్లుళ్ళ మధ్య  జరిగిన సంభాషణ ఈ కథ. కుటుంబంలో సాధారణంగా అమ్మా,నాన్న,అన్న,తమ్ముడు తదితరులు ఉండటం సహాజం. పిల్లలు పెద్దవారై వారు స్వతంత్రంగా జీవించాలి అనుకునే సందర్భంలో ఆస్తిపంపకాల విషయాలు మధ్య సమస్య తలెత్తడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఎదుర్కొనే సంఘటనను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చాలా అనుభవం కలిగిన వారి సలహాలు ఉపయుక్తకరంగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో అటువంటి సలహాలు ఏవి స్వీకరించాలి,ఏవి స్వీకరించకూడదు అని ఎంతో పరిపక్వతతో నిర్ణయం తీసుకుంటే, ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని రాసినది ఈ కథ.

3.3.2 కథాసమీక్ష:

అనగనగా ఓ సలహా కథ మొత్తం ముత్యాలరావు తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు తన అల్లుడు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమో అని ముందుగానే ఓ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహా స్వీకరణ సముచితమైనదా అసముచితమైనదా అని రాంబాబు మామ గారితో సందర్భానుచితంగా వ్యవహరించడం జరుగుతుంది. ముత్యాలరావు వయసులో ఉన్నప్పుడు కుటుంబం కోసం వ్యవసాయ పనులు చేస్తూ తన తమ్ముళ్ళను చదివిస్తాడు. తమ్ముళ్ళు ఇద్దరిలో నడిపోడికి గవర్నమెంట్ జాబు రావడం, తన చిన్న తమ్ముడు వ్యవసాయ పనులను నేర్చుకోవడం, వారికి పెళ్లిళ్లు జరిగిపోవడం,వారి ఆస్తులు వాటాల పంపకం జరిగిపోతుంది. గవర్నమెంట్ జాబు ఉన్నందువల్ల నడిపోడు తన యొక్క వాటాగా వచ్చిన పొలాన్ని సోదరులకు ఉదారంగా ఇస్తాడు. ఆ పొలాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇవ్వమని కోరడంతో అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావడం జరుగుతుంది. 'ఒకే కడుపున పుట్టిన తమ్ముడు కూడా పరాయి వాడే’8 అని ముత్యాలరావుకి అనిపిస్తుంది.

ముత్యాలరావు అల్లుడు కుటుంబం కూడా ఇదే తరహాలో ఉండటం తాను ఎదుర్కొన్న సమస్యలు తన అల్లుడు ఎదురుకోవాల్సి వస్తుందేమో అని కొన్ని మాటల ద్వారా  అభిప్రాయాలను తెలియజేస్తాడు.  అప్పుడు రాంబాబు 'ఇప్పుడు  వయసు ఎంత' ? అని అడగడంతో 56 సంవత్సరాలు, మీ అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి ఎంత కాలం అయ్యింది?  ఐదు సంవత్సరాలు అయింది. మామయ్య ‘ఇప్పుడు అందుతున్న మంచి సువాసనను వదిలేసి రేపు ఎప్పుడో కుళ్ళిపోతుందని బాధపడటం లాంటిదే మీరు ఇచ్చిన సలహా’9అన్యధా భావించవద్దు మామయ్య అని మెట్లవైపు అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు రాంబాబు.

3.3.3 రచనావిశేషాలు:

రచయిత ఈ కథ ద్వారా కుటుంబ సంబంధాలను చక్కగా చిత్రీకరించారు. ఎప్పుడో మోసం చేస్తారని నిరంతరం సందేహిస్తూ బతకడం చాలా దుర్లభం. మహా అయితే కొంత ఆస్తో, డబ్బు నష్టపోతాం కానీ అనుమానించడం మొదలు పెడితే బంగారం లాంటి బంధాలను నష్టపోతాం అని చెప్పడం జరిగింది.

4. సన్నివేశచిత్రణ:

కథరచనలో సన్నివేశాత్మకం కూడా ఒక ముఖ్యాంశమేనని చెప్పవచ్చు. సాధారణంగా నవల రచయితలు కానీ కథారచయితలు కానీ వస్తువు, సన్నివేశ నిర్మాణాలను కూడా తనకు ప్రత్యక్షంగా తెలిసిన వాటిని గాని అంతో ఇంతో పరిచయం ఉన్నవి చిత్రిస్తుంటారు. ‘కథా వస్తువు అందరికీ తెలిసిన్నప్పటికీ అతను ఏ ఏ సన్నివేశాలలో ఎలా మలుచుకుపోతారు అన్నది ప్రధానం. రచయిత కథకు ఒక నిర్ణీత పద్ధతిని అనుసరించి ఆ కథ అదేవిధంగా జరగడానికి అనుకూలమైన సన్నివేశాలని అందులో నిక్షిప్తించి కార్య కారణాలు ఒక రూపం ఇస్తారు’.10 కుటుంబ జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ పాఠకుడు హృదయానికి హత్తుకునే ఇలాంటి పాత్రల ద్వారా సర్దుబాటు కథ లో 'చక్రవర్తి', చూడు నాన్న... కథలో 'నాన్న', అనగనగా ఓ సలహా కథలో 'ముత్యాలరావు' పాత్రలు అద్భుతంగా మలిచారు. పై మూడు కథలలో పాత్రలు ప్రధానంగా కుటుంబం చుట్టూనే తిరిగాయి కథలలో ఏకాంశం గా ఉన్నది ఏమిటి అని ఆలోచిస్తే కుటుంబ బాంధవ్యాలు అని చెప్పవచ్చు.

5. కథల్లోని పాత్రల స్వభావం:

కథా ప్రక్రియలో కనిపించే పాత్రల ద్వారా నిజ జీవిత సంఘటనలనే ఆధారంగా చేసుకుని రచయిత చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా చెప్పారు. సర్దుబాటు కథలో చక్రవర్తి పాత్ర అమోఘమైనది,అద్వితీయమైనది. ఎందుకంటే కనిపెంచిన కొడుకే తన తండ్రి ప్రవర్తనను ఒకానొక సందర్భంలో నచ్చకపోవడం జరుగుతుంది. కారణం అందరితో మంచివాడు అనిపించుకోవడానికి మాత్రమే సాయం చేస్తున్నాడు అని తన కొడుకు అనుకుంటాడు. కానీ కథ చివరలో చక్రవర్తి గ్రామ ప్రజలకు చేసిన మంచితనం వల్ల తన కుమారుడు గ్రామాన్ని కుటుంబంగా బహుమతి పొందాడు. తండ్రి పాత్ర ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మనం బాగుండడం, అలాగే మన చుట్టూ ఉండే వాళ్లు కూడా మనతో పాటే సంతోషంగా ఉండాలి.ఇలాంటి విలువలతో కూడిన ప్రవర్తన కుటుంబ సభ్యులే పిల్లలకు నేర్పాలి. చూడు నాన్న కథలో భారతీయ సంస్కృతి వ్యవస్థలో భాగంగా అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఆమెను అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రులు బాధపడడం సహజం. అలాంటి సందర్భంలో కుటుంబ సభ్యులలో ఎక్కువగా తండ్రి బాధపడడం చూస్తుంటాం. అప్పుడు ఎవరు చెప్పినా మనసు కుదుటపడదు. అప్పుడు అల్లుడే స్వయంగా మామ దగ్గరకు నీ కూతురి కంట కన్నీరు రాకుండా చూసుకుంటాను అంటాడు. ఇక్కడ కుటుంబం అంటే కేవలం తండ్రి కుమారుడు మాత్రమే కాదు కూతురి వైపు ఉన్నవారు కూడా కుటుంబ సభ్యులే. అల్లుడు ఇచ్చిన ధైర్యం మామను స్థిమిత పడేలా చేసింది. అలాగే అనగనగా ఓ సలహా కథలో కూడా మామ అల్లుళ్ళ మధ్య జరిగిన సంభాషణ కుటుంబ జీవితానికి సంబంధించిన అంశమే. సాధారణంగా కొన్ని సందర్భాలలో కుటుంబంలోని సభ్యులు సలహాలు ఇవ్వడం చూస్తుంటాం ఇలాంటి సలహాలు చాలా ఉపయుక్తమైనవి. కానీ ఈ కథలో మామగారు ఇచ్చిన ‘సలహా’ అనే పదాన్ని సలహా అనడం కంటే స్వార్థం అనడంలో తప్పులేదు. ఎందుకంటే తన అల్లుడు బాగుంటే తన కూతురు సంతోషంగా ఉంటుందని స్వార్థ భావన మనకు కనిపిస్తుంది. అయినా మామగారు ఇచ్చిన సలహాను సుతిమెత్తగా తిరస్కరించిన విధానం అమోఘం.

6. ముగింపు:

  • కథానిక ప్రాముఖ్యతను తెలుసుకున్న ఈనాడు దినపత్రిక, ప్రతి ఆదివారం సంచికలో ఒక కథను ప్రచురిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాము.
  • ఆధునిక రచయితలు కథానిక ప్రక్రియపై ఆకర్షితులై అధికంగా కథానికలు రచిస్తున్నారు. అలాగే కథానిక ప్రాముఖ్యత వీరు వల్ల పెరిగింది.
  • కథానికలు వ్రాస్తున్న యువరచయితలలో బాడిశ హనుమంతరావు గారు ఒకరు.మీరు వర్ధమాన అంశాలను ఇతివృత్తంగా  తీసుకొని కథలు రాస్తున్నారు.
  • కథానిక ప్రక్రియ ద్వారా ఒక సన్నివేశాన్ని మాత్రమే చెప్పగలరు. ఆ సన్నివేశాన్ని ప్రవేశం, ప్రదర్శన, ముగింపు అను క్రమంలో చెప్పడం జరుగుతుంది.
  • బాడిశ హనుమంతరావు గారు రాసిన మూడు కథలను ఒకే కథగా సంశ్లేషణ చేయగా కుటుంబ సంబంధాల అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాస్తున్నారు అనిపిస్తుంది.
  • సర్దుబాటు కథలో చక్రవర్తి ద్వారా మానవీయతకు అద్దం పట్టే పాత్రను, కుటుంబంలో ఒక తండ్రిగా నివర్తించాల్సిన బాధ్యతలు క్షుణ్ణంగా తెలియజేశారు.
  • చూడు నాన్న కథలో ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపినప్పుడు వధువు కుటుంబంలో ఉండే ఆవేదన గురించి తెలపడం జరిగింది. మరియు తండ్రి కూతురి మధ్య ఉండే బంధాన్ని విలువైన పదాలతో పాఠకులను సంతృప్తి పరిచారు.
  • అనగనగా ఒక సలహా కథలో కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వివాహానికి ముందు, వివాహానికి తర్వాత వచ్చి మార్పులు చాలా కఠినంగా ఉంటాయని తెలుసుకున్నాం.
  • మూడు కథలలో కూడా ప్రధానంగా కుటుంబంలో ప్రధానపాత్ర వహించేది తండ్రిగా చిత్రీకరించారు. మిగతా వారి పాత్రలు నామమాత్రంగా చెప్పడం గమనార్హం.
  • ఒక కథానిక ద్వారా రచయిత చెప్పదలుచుకున్న అంశాన్ని నామమాత్రంగా మాత్రమే చెప్పడానికి వీలవుతుంది.అటువంటి సందర్భాలలో విడివిడి భాగాలుగా ఉన్న సమాన ఇతివృత్తం గల కథలను సంశ్లేషణ చేసి పరిశీలిస్తే అది సంపూర్ణంగా అవగాహన అవుతుంది అని తెలుసుకున్నాము.

7. సూచికలు:

1. కథానిక స్వరూప స్వభావాలు, స్వీయ ప్రచురణ, హైదరాబాద్, 1988 పుట.131.
2. తెలుగు సాహిత్య చరిత్ర రెండో సంపుటం ఆచార్య జి.నాగయ్య: పుట. 614
3. ఈనాడు దినపత్రిక ఆదివారం సంచిక, 2018,నవంబర్,11. పుట.20.
4. ఈనాడు దినపత్రిక ఆదివారం సంచిక,2018,నవంబర్,11. పుట.21.
5. ఈనాడు దినపత్రిక ఆదివారం సంచిక,2019, అక్టోబరు,13.పుట.22.
6. ఈనాడు దినపత్రిక ఆదివారం సంచిక,2019, అక్టోబరు,13.పుట.20.
7. ఈనాడు దినపత్రిక ఆదివారం సంచిక,2019, అక్టోబరు,13.పుట.23.
8. ఈనాడు దినపత్రిక ఆదివారం సంచిక, 2020, మే, 31.పుట.22.
9. ఈనాడు దినపత్రిక ఆదివారం సంచిక, 2020, మే, 31.పుట.22.
10. బలివాడ కాంతారావు నవలలు -  పరిశీలన డాక్టర్ జి మోహన్ బాబు పుట. 256

8. ఉపయుక్త గ్రంథసూచి:

  1. Tilak, Raghukul. (2019). Literary forms trends and movements, Twenty-first edition, Rama brothers India private limited. Educational public publishers. New Delhi
  2. చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం. (2023). మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
  3. పైదే. (2023). మన నవలలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. హైదరాబాద్
  4. తెలుగులో కవిత్వోద్యమాలు. (2015). తెలుగు అకాడమీ ప్రచురణ, హైదరాబాద్
  5. దక్షిణామూర్తి, పోరంకి. (1988). కథానిక స్వరూపస్వభావాలు. స్వీయప్రచురణ, హైదరాబాద్.
  6. నాగయ్య, జి. (2009). తెలుగు సాహిత్య సమీక్ష. రెండవ సంపుటం, సి.ఎన్. ప్రింటర్స్ ప్రకాశం
  7. వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. (1995). కథాశిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ
  8. వెంకటేశ్వర్లు, బూదాటి (2012). తెలుగు సాహిత్య ప్రక్రియలు - ధోరణులు. హిమకర పబ్లికేషన్, హైదరాబాద్
  9. శార్వరి (సంకలనం). (2022). కథలెలారాస్తారు? విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
  10. శివప్రసాద్, వల్లూరు. (2016). కథానిక-పాఠాలు, అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు
  11. సత్యనారాయణ, ఎస్వి. (2007). గ్లోబలైజేషన్ కథలు. విశాలాంధ్ర పబ్లిక్ హౌస్. హైదరాబాద్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]