AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. కర్నూలు జిల్లా కథాసాహిత్యం (2011-2020): ప్రాంతీయ జనజీవనచిత్రణ

కె. వెంకటస్వామి
పరిశోధక విద్యార్థి, తెలుగు అధ్యయనశాఖ,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9052961440, Email: swamy.ma82@gmail.com
Download
PDF
సమర్పణ (D.O.S): 20.08.2024 ఎంపిక (D.O.A): 30.08.2024 ప్రచురణ (D.O.P): 01.09.2024
వ్యాససంగ్రహం:
కర్నూలుజిల్లా కథాసాహిత్యంలో వచ్చిన విభిన్నమైన కథాప్రక్రియలో ప్రాంతీయతను, స్థానికత కల్గిన వస్తువును గుర్తించటం, కథకుడు చిత్రించిన సామాజికజీవనవిధానంలో వైఖరులను పరిశీలించి, ఒక దశాబ్దకాలం (2011-2020)మాత్రమే పరిమితమై విశ్లేషించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. కర్నూలుకథా రచయితలు ప్రచురించిన కథాసంకలనాలు, సంపుటాలపై విశ్లేషణాత్మకపద్దతిలో పరిశోధించి, ప్రాంతీయంగా, స్థానికంగా ఉండే సామాజిక జనజీవనంలోని మార్పులను, సమస్యలను ఈ వ్యాసాంశం వ్యక్తీకరిస్తుంది. ఈ పరిశోధన వ్యాసాంశం వలన ప్రాంతీయంగా, స్థానికంగా ఉండే జనజీవనవిధానం, సమస్యలు, పరిస్థితులు వ్యక్తమవుతాయి. కర్నూలుజిల్లా కథాసాహిత్యంలో- ప్రాంతీయ జనజీవన చిత్రణపై పరిశోధన నుండి ఆశించి వచ్చే ఫలితాల్లో ప్రాంతీయతకు, స్థానికతకు, ప్రాధాన్యతను కల్పించుటం. సుధీర్ఘకాలంగా ఉండే సమస్యలకు పరిష్కారమార్గాలను ఆలోచించే దిశగా పయనిచడం. కర్నూలు కథాసాహిత్యంపై అనేక పరిశోధనలు జరిగాయి. పూర్వపు పరిశోధనలు ‘కర్నూలు కథ సంకలనం- భాషాపరిశీలన’ అనే అంశంపై, మరొకటి ‘కర్నూలుజిల్లా కథాసాహిత్యం- వృత్తి జీవిత చిత్రణ’ అనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పరిశోధనలు జరిగాయి.
Keywords: కర్నూలు జిల్లా కథలు, కర్నూలు కథా సాహిత్యం, జనజీవనం, ప్రాంతీయత, ప్రాంతీయ దృక్పథం, సామాజిక వివక్ష, ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయ వివక్ష, సామాజిక విప్లవం, ప్రాంతీయ ఫ్యాక్షన్లు, దళిత సాహిత్యం.
1. ఉపోద్ఘాతం:
కర్నూలు కథా సాహిత్యంలో 2011-2020 సంవత్సర కాలంలో నూతన ఒరవడితో కూడిన రచనలు ప్రచురించబడ్డాయి. ఈ దశాబ్దంలోని వచ్చిన రచనల నుండి స్థానికంగా ఉండే విషయ వస్తువుకు ప్రాధాన్యతను కల్పిస్తూ రచనలు చేశారు. ముఖ్యంగా రచయితలు గత దశాబ్దానికి భిన్నంగా కథా వస్తువును తమ రచనల్లో చోటు కల్పించారు. ఆంధ్రపదేశ్ విభజన పరిస్థితులు సాంకేతికంగా వచ్చిన మార్పులు, ప్రపంచీక ప్రభావం, కరోనా వంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక జీవనాన్ని పరిశీలించి, స్వీయ అనుభవంతో కథలను చిత్రించారు. ఆధునిక జీవన విధానంలో వస్తున్న మార్పును గమనిస్తూ, ప్రాంతీయకు, స్థానికతకు తగ్గుతున్న ప్రభావాన్ని రచయితలు స్పష్టమైన రీతిలో పట్టం కట్టారు. ఆధునిక నాగరిక కాలంలో కూడా ఎదుర్కొంటున్న ప్రాంతీయ వివక్షతలను, వైఖరులను కథకులు తమ రచనల్లో చిత్రించి, సమాజం ఆశించే స్థాయిలో కథలను ప్రచురించారు. ఈ దశాబ్ద కాలంలో కర్నూలు జిల్లా కథకుల నుండి వెలువడిన ప్రచురణల్లో ఊరిమర్లు, నేరేడు రంగు పిల్లవాడు, నిప్పులవాన, నీళ్ళంకనినేల, దేవరగట్టు, మాదిగోడు వంటి వాటిలో ప్రాంతీయ జనజీవన చిత్రణకు ప్రాధాన్యతను కల్పించి రచనలు చేశారు. ఈ దశాబ్దంతో కర్నూలు జిల్లా రచయితలు ప్రచురించిన కథా సంపుటాలు, సంకలనాలు కలసి దాదాపు ముప్పై వరకు వచ్చాయి. ప్రతి ప్రచురణ ఒక్కొక్కటి వేటికవే ప్రత్యేకంగా ప్రాంతీయతకు పట్టం కట్టేలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
2. కర్నూలు కథా సాహిత్యంలో (2011-2020) వచ్చిన రచనలు:
కర్నూలు కథా సాహిత్యంలో 2011 నుండి 2020 వరకు వచ్చిన కథా సంపుటాలు, కథా సంకలనాలు ఆధునిక ధోరణులతో కూడిన వస్తు చిత్రణ, ప్రాంతీయ అస్తిత్వాలు, స్త్రీ సంబంధిన అంశాలు, బహుజన సాహిత్యం, దళితుల జీవనము, ప్రాంతీయ వివక్షలు, రైతుల జీవన విధానం, ఆధునిక సామాజిక ధోరణులు, ప్రపంచీకరణ, నిరుద్యోగము, సంస్కృతి, సంప్రదాయాల భిన్నత్వము లతో కూడిన సాహిత్యానికి బీజం పడింది.ఈ దశాబ్దంలో వచ్చిన సంకలనాలు,సంపుటాల్లో పరాయోళ్ళు (2011)లో వచ్చిన జి. ఉమామహేశ్వర్ కథల సంపుటి, కనిపించని చెయ్యి (2011) హెచ్చార్కె కథల సంపుటి, నిచ్చెన (2012)లో వచ్చిన యస్.ఎం.డి.ఇనాయతుల్లా కథా సంపుటి, అక్షయమైన వెన్నెల (2014)లో వచ్చిన పేరం ఇందిరాదేవి కథా సంపుటి, అమూల్య (2015)లో వచ్చిన సుభాషిణి కథల సంపుటి, బతుకు చిత్రం (2015)లో వచ్చిన ఎన్.డి.వి. అజీజ్ కథానికల సంపుటి, గుర్నూలు పూలు (2016)లో వచ్చిన డా.ఎం.హరికిషన్ కథల సంకలనం,పెట్టుడు రెక్కలు(2016) లో వచ్చిన జంధ్యాల రఘుబాబు కథా సంపుటి, శ్రేయోభిలాషులు(2016) టి.సురేష్ బాబు కథలు, దేవర గట్టు (2017)జి.వెంకటకృష్ణ కథల సంపుటి, పరాయోళ్ళు (2017), భరోసా(2018) జి.ఉమా మహేశ్వర్ కథల సంపుటిలు, ప్రమోదంలో ప్రమాదం (2019) లో వియోగి, లయతప్పిన గుండె (2019) యస్.డి.వి.అజిజ్ కథల సంపుటి, నీళ్ళింకని నేల (2019) యస్.యం.డి. ఇనాయతుల్లా, కెంగార మోహన్ కథల సంకలనం, నిప్పులవాన (2020) కెంగార మోహన్ కథల సంపుటి, నేరేడు రంగుపిల్లవాడు(2020)పాణి కథల సంపుటి, సిద్దేశ్వరం అడుగు (2020) జి.వెంకట కృష్ణ, మారుతి పౌరోహితం కథం సంకలనం, విషాద ఏకాంతం (కథలు) కాశీభట్ల వేణుగోపాల్ రచనలు వంటివి ప్రచురించ బడ్డాయి. ఈ కథా సాహిత్యంలో రచయితలు కర్నూలు జిల్లా ప్రాంతీయ దృక్పథానికి సామాజిక, సాంఘిక జీవనానికి, రైతులు, మహిళలు, దళితులు, విద్యార్థులకు సంబంధించిన, కథా వస్తువు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతీయ మాండలక భాష, యాసలతో కూడిన వస్తుశిల్పంతో కథలను సుసంపన్నం చేశారు.
3. కర్నూలు జిల్లా కథల్లో జనజీవనం:
సాహిత్యము ఏదైనా, భాష ఏదైనా అది సమాజానికి ప్రతిబింబం. సమాజానికి దూరంగా ఉండేట్లుగా ఏ సాహిత్యం సృష్టించబడదు. సాహిత్యం సమాజానికి సమాజంలోని ప్రజానికానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. అటు వంటి సాహిత్యం మానవుల్ల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది, ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తుంది. నిద్రాణమై ఉన్న సమాజాన్ని మేలుకొల్పుతుంది. సమాజం లోని ప్రజాజీవితాల్ని, మానవ సంబం దాలను, మానవుని సమస్యలను రచయితలు తమ రచనల్లో ప్రస్తావించారు. సమాజంలోనికి బలవంతులు, బలహీను లు,అణిచి వేసేవారు, అణిచి వేయబడ్డవాడు వంటి వారు సాహిత్యంలో దర్శనమిస్తారు. ఇటు వంటి సమాజంలోని జన జీవన విధానాన్ని ఇతివృత్తాలుగా ఎన్నుకొని, జన జీవన సమూహంలో ఉండే వారినే పాత్రలుగా మలుచుకొని కథలను రచించారు. రచయితలు సమాజంలోని సమస్యలను, అనుభవాలను, మంచి చెడులను, తమ రచనల ద్వారా సమాజానికి తెలియజేశారు. వీరు రాసిన విషయాలను తెలుసుకున్న ఈ సమాజం విజ్ఞాన వంతముగా, సంస్కారవం తంగా వెలుగొందాలని ఆశిస్తారు. కాబట్టి కర్నూలు జిల్లా కథకులు కూడా తమ కథల్లో కర్నూలు జిల్లా ప్రజల జీవన విధానాల్ని. ఆచార వ్యవహారాలను, ఆర్థిక పరిస్థితులను, విశ్లేషించడం, ఇక్కడి ప్రాంతీయ జన జీవనంలో కుటుంబ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతి అంశాలకు ఈ దశాబ్దంలోని కథలన్నీ అద్దం పడతాయి. (తెలుగు కథానిక, తెలుగు అకాడమి-106)
4. కర్నూలుజిల్లా- కథాసాహిత్యం (2011-2020):
నాగరికతకు అనుగుణంగా సమాజంలో కొత్త, కొత్త సామాజిక సందర్భాలు, ఉద్యమాలు ఏర్పడుతుంటాయి. ఈ సమాజిక ఉద్యమాలు, సందర్భాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అలాంటి పరిస్థితే సమైకాంద్ర ఉద్యమం, ఈ వాదాన్ని వ్యతిరేకిస్తూ సాగడం అనేది కర్నూలు జిల్లా కథా సాహిత్యంలో ఒక కొత్త సందర్భంగా విశ్లేషించుకోవచ్చు. ఈ సందర్భంలో కర్నూలు కథాసమయం మిత్రులు ప్రచురించిన కథల్లో 'విభజనరేఖలు' వంటి కథా సంకలనం, రాయలసీమకు జరిగిన అన్యాయాలు, మోసాలు గుర్తుకొస్తూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు కర్నూలుకు కేటాయించిన కర్నూలు రాజధాని, హైకోర్టు, కృష్ణానదీ జలాల్లో నీటి వాటా 400 టీ.ఎం.సీ.లు ఏమైనట్టు? శ్రీబాగ్ ఒప్పందం సమీక్ష ఏమైనట్టు? అనే వాస్తవిక దృక్పథంలో నుంచే కర్నూలు జిల్లా కథా రచయితల రచనల నుండి తెలంగాణను సమర్థించే ప్రాంతీయ అస్తిత్వంతో కూడిన కథా వస్తువులకు పురుడు పోశారు. ఈ దశాబ్దంలో వచ్చిన కథల్లో రచయితలు మూడు సూత్రాలను ఆధారంగా చేసుకొని తమ కథా రచనలు చేశారు. అందులో సామాజిక జీవనంలో జీవితం ఇట్లుంది, జీవితం ఇట్లా ఎందుకుంది, జీవితం ఏం చేసే బాగుపడుతుందనే విషయాలను పాత్రలకు అన్వయించి కొత్త తరంతో కూడిన రచనలు చేశారు. అందులో కె. సుభాషిణిగారి ధృతరాష్ట్రుని కౌగిలి, గాయాలు, రెండు సంధర్భాలు, జి. వెంకటకృష్ణ గారి వర్తమానం, లోగిలి, రెండో వీరగల్లు, విభజనరేఖలు, వేదవతి, డా.ఎం.హరికిషన్ గారి కథ జై తెలంగాణ, కొత్తకల, జి.ఉమా మహేశ్వరరావు జలపాఠం, పరాయోళ్ళు, వాటర్, చెంచుమిట్ట, మన అవసరం, పినాక పాణి గారి కథలు ఇన్ మోషన్, ఔట్ ఫ్లో, నది పారని నేల, నేరేడు రంగు పిల్లవాడు, మారుతి పారోహితం కాల్వ, ఊరిమర్లు, నిర్ణయం, మలుపు, కుశలంబే కదా ఆంజనేయ, వంటి కథల్లో కర్నూలు జిల్లా కథా వస్తువు కొత్త పంథాతో ప్రాంతీయ జన జీవనానికి అద్దం పడుతున్నాయి. (రాయలసీమ : సమాజం సాహిత్యం : పుట- 205).
4.1 ప్రాంతీయ దృక్పథం:
కర్నూలు జిల్లా కథా సాహిత్యంలో కర్నూలు జిల్లా వాసుల కడగండ్ల కష్టాలే కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే ప్రతి కష్టానికి ప్రభుత్వము, రాజకీయాలు, అధికారులు, మనం మనం తెలుగు వారమని చెప్పి నమ్మించే స్వార్థపరులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ కారకులే. కర్నూలు జిల్లాకు చుట్ట ముట్ట ఉన్న సమస్య లకు ప్రధానమైన అంశాలు ఇక్కడి భౌగోళిక సంస్థితులు, వాతావరణ ప్రభావం అనుకూలంగా లేక పోవడం, వర్షభావ ఆధారిత ప్రాంతం. కావడంతో, నీటి కొరతే ప్రధానంగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలన్నింటిన్నీ జయించాలనే దృడసంకల్పంతో కర్నూలు జిల్లా ప్రాంత వాసులు కొన్ని గ్రామాలను కొన్ని వేల ఎకరాల సాగుభూముల్ని త్యాగం చేసి, ప్రతి ఫలంగా వారికి ప్రభుత్వము, పాలకులు, స్వార్ధపరులు మాత్రం సూర్యనారాయణ, సుంకులు, చాంద్ వంటి వ్యక్తులు కుటుంబాలలో చీకట్లు నింపాయని ‘ఔట్ ఫ్లో’ కథలో రచయిత చిత్రించాడు. క్రిష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎగువ ప్రాంతాల గ్రామాలను నమ్మబలికించి మోసం చేశారనేది ఈ కథలో కళ్ళకు కట్టినట్లుగా చిత్రించాడు రచయిత.
“అసలు ఆ నా కొడుకులు ఈడ కాదంట డ్యాం కట్టాల్సింది. పైదిక్కు కట్టాల్సిండె నంట. అది కాదని ఇట్ల కడ్తున్నారు. ఇన్ని ఊర్లు ముంచి, ఇంత మంది కడుపు కొట్టి దీన్ని కుడ్తుండేది తాగేకి, చేలకి నీల్లియ్యడానికి కాదంట, కరెంటు తీస్తరం.... కరెంటు”-1
అంటూ సూర్యనారాయణ పాత్ర చేత పలికించాడు రచయిత. శ్రీశైలం ప్రాజెక్ట్ ను కట్టాల్సిన చోటు కాకుండా కర్నూలు జిల్లాకు నష్టాన్ని చేకూరేట్టుగా, దిగువ ప్రాంతాల వారికి ఉపయోగ కరంగా ఉండేటట్లుగా, ఏక పక్షపాతంగా ప్రాంతీయ వివక్ష ధోరణతో నిర్మించడం వలన సుంకులు, చాంద్, సూర్య నారాయణ వంటి కుటుంబాలు. ఊర్లకు, ఊర్లును పొగొట్టుకున్నారు. ఆస్తులన్ని పోయాయి, ఆత్మగౌరవం కూడా కూడా ముంపు ప్రాంతాలు మునిగి పోయినట్లుగా మొత్తం నాశనమైపోయాయి. ప్రజలను, రైతులు కట్టు బట్టలతో కడుపు చేతబట్టుకొని వేరే ఊరిలో బతకడం ఎంత నరకయాత్రలో సుంకులు పాత్రలో తీర్చిదిద్దిన తీరును బట్టి రచయితకు ప్రాంతీయతపై ఉండే పల్పు స్పష్టంగా కనిపిస్తుంది. (నేరేడు రంగు పిల్లవాడు (కథలు):ఔట్ ఫ్లో: పినాకపాణి: పుట:85)
4.2 సామాజిక వివక్ష:
కర్నూలు జిల్లా కథా ప్రక్రియుల్లో రచయితలు వలసదారుల ఆధిపత్యాలను బహిర్గతం చేస్తూ కథా వస్తువును చిత్రంచాడు. బంగాళఖాతం నుండి వచ్చే తుపాములకు గోదావరి నది శివమెత్తి విజృంబిస్తే ఉన్న ఇల్లు, ఊరు నామ రూపాల్లేకుండా పోయి, మిగిలన వారు వలస పట్టి కర్నూలు జిల్లా మీద పడ్డారు. కర్నూల్ కాకుండా తుంగభద్ర నది తీర ప్రాంతం చుట్టూ ఉండే సింధనూరు, గంగావతి, రాయచూరు వంటి ఊళ్లకు కట్టు బట్టలతో వచ్చి ఇక్కడి స్థానికులపై ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరుకున్నారనీ ‘పరాయోళ్ళు’ వంటి కథలో కథకుడు కళ్ళకు కట్టినట్లుగా రచించాడు. సాంబశివరావు భార్యా పిల్లలతో కట్టు బట్టలతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కౌతాళం మండలానికి చేరితే గ్రామస్థులు వారి పరిస్థితిని గమనించి ఊరు పేరు పట్టించుకోకుండానే చేరదీసి తమలో ఒకరిగా చేసుకొని ఆదరిస్తారు. కాని తల్లిపాలు తాగి తల్లి రోమ్మునే తన్నే రకం అనే విషయాన్ని గ్రామస్థులు గ్రహిస్తారు.ఇక్కడ గ్రామంలో టీచర్ గా పనిచేస్తున్న అతని మాటల్లో
“సాంబశివరావు గారూ! ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఏం జరిగిందో? ఈరన్నకి చానా దెబ్బలు తగిలాయి. ఆదోనిలో లాభం లేదంటే కర్నూలుకు ఎత్తుకుపోయినారు. ఏమైన కొట్టేంత తప్పు ఆయనేం చేసినాడు. సరే కూలిడబ్బులు ముందే తీసుకుని పిల్లోళ్ళను పంపియ్యలేదు అంటున్నాడు మీ భావమరిది. నిజమే ఉన్నట్టుండి డయేరియా వచ్చి పిల్లోలకు వాంతులు, భేదులుతో నీరసంగా నేలక్కురుచుకుంటే కూలీకి ఎట్లొస్తారు?”-2
అని ప్రశ్నిస్తాడు. కూలీకి పిల్లల్నీ పంపించనందు సాంబశివరావు కొడుకు రవి,బావమరిది గుర్నాధంలు ఇద్దరూ కలిసి ఈరన్న కొట్టడంతో పరిస్థితి విషమిస్తుంది.అయినా సాంబశివరావు కొడుకుని,బావ మరిదిని, ఒక మాట కూడా దండించు కుండా హాస్పిటల్ ఖర్చులిస్తాను, ఏమి కాకుండా చూసుకుంటానని అహంకార పూరితంగా మాట్లాడుతాడు. కానీ గ్రామస్థులంతా ఏకమై ఎదురు తిరగడంతో రాజకీయ పలుకుబడికి ప్రయత్నం చేస్తాడు. అవి కూడా సమస్యకు పరిష్కారాని చూపకపోవడంతో నెలరోజుల్లోపల ఊరిడిస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా జీర్ణించుకోక పోవడం అనే విషయాన్ని రచయిత వలసదారుల పెత్తందారితనాన్ని, సామాజిక వివక్షతను బయట పెట్టారు.(పరాయోళ్ళు (కథలు): పరాయోళ్ళు: జి.ఉమామహేశ్వర్ : పుట:15)
4.3 ప్రాంతీయ అస్తిత్వం:
కథాప్రక్రియలో కథకుడు పూర్తిగా గ్రామీణ జీవితాలను వస్తువుగా తీసుకొని కథను మలిచిన తీరు అద్భుతంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో పుట్టినయి వంటి రచయితకు మాత్రమే స్థానికంగా ఉండే విషయాలపై గురి ఉంటుంది. అంతకి గురి ఉన్న రచయిత గువ్వలదొడ్డిలో జన్మించిన మారుతి పౌరోహితం గారికే చెందుతుందని చెప్పవచ్చును.కెంపు అనే కథలో రచయిత ఎమ్మిగనూరు మండల పరిదిలోనిదైవందిన్నే,పెద్దమరీడు, పార్లపల్లె గ్రామాల్లోని గౌడ వర్గానికి చెందిన వారు బోయలను, కురువ కులం వారిని అడ్డం పెట్టుకుని తన రాజకీయా లను ఎలా నడిపారనే కథను అద్భుతంగా చిత్రించాడు. దొడ్డ రంగన్న గౌడ్, సిద్ధరంగన్న గౌడ్ల రాజకీయ చదరంగంలో పైగేరి గిడ్డయ్య, అతని తమ్మున్ని కాపుకాసి చంపించడం, బలంగా ఉన్న కురువు కులం గొరువ బీరప్ప కుటుంబాలను ఊరిడిపించడం వంటి అంశాలు గ్రామీణ సమాజంలోని గౌడల ఆధిపత్యాన్ని రచయిత బయటపెట్టాడు.గౌడ్ల కుటుంబా లకు ఎదురు దూట్లాడినా ఎదురు తిరిగినా వారి పీనుగలే దర్శనమిచ్చేవి. ఎందుకుంటే గౌడ్ల వెనుక తిరిగిన పైగేరి గిడ్డయ్య కొడుకు రామాంజనేయులు విషయంలో ఎలక్షన్లు దగ్గర పడటంతో ఒకరికొకరు పడని గౌడ్ల కలిసిపోవడంతో తమ పరిస్థితి ఏమిటనేది అర్ధం చేసుకుని
“మాము బాగు పడటం ఇష్ణుమూ ల్యాక సేన్లకి ఈయస్పోల్లె నీళ్ళు రాకుండా సేసినారు. కిన్లోల్లు నీల్లు దొంగులుక పోయ్యేరని మనం ఎందుకనుకునాల? ఆయప్పోల్లు దొంగులు కుంటే ఈయప్పోల్లు ఏమి చేస్తున్నట్లు?ఏమల్యా ఈనాయండ్లకి సేన్లు పండితే మన మాట ఇనరు అనేది ఆయప్పొల్ల అనుమానం. దానికే ఇన్ని దినాలైనా సుక్కనీల్లు త్యాల్యా అందరిండ్లల్ల ఆడోళ్ళు తిరగబడుతుండారు”-3
అని ఆలోచిస్తాడు. గౌడలు లాంటి, రాజకీయ నాయకులు మరణిస్తే వారిగురించే మాట్లాడు కుంటారే తప్పా! వారి స్వార్థం కోసం బలైన కురవలు, బోయలు గురించి మాట్లాడకుండా చేసిన ఆలోచనల్లో ఉండే అస్తిత్వధోరణులను రచయిత అద్భుతంగా మలిచాడు. కర్నూలు జిల్లా గ్రామీణ జీవితాల్లో బి.సి.లు, దళితుల కుటుంబాలు, కుటుంబాబు నాశనమయ్యాయి. చాలా మంది ఆడపిల్లలు బలయినటు వంటి పరిస్థితులు కనిపిస్తాయనే వాస్తవాన్ని కెంపు కథలో రచయిత ప్రాంతీయ దృక్పథంతో తెలియపరిచాడు.(ఊరిమర్లు(కథలు):కెంపు:మారుతి పౌరోహితం :పుట:108)
4.4 ప్రాంతీయవివక్ష:
ఒకే తల్లికి పుట్టిన కొడుకులు ఆస్థుల పంపకంలో వివక్షతను కల్గింటారు. ఎవరూ? దేనిని దేనిని వాటాల పంపకం అడుగ తారనే విషయాన్ని ఉమామహేశ్, నాగేశ్వర్, రాఘవ ముగ్గురు అన్నదమ్ములు వారి పాత్రలను శిల్పంగా తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిత ఆంధ్రప్రదేగా ఏర్పడినప్పటి పరిస్థితులను, వాస్తవాలను, ప్రాంతీయ వివక్షతతో వెంకటకృష్ణ ‘విభజనరేఖలు' కథలో రాయలసీమ, తెలంగాణా, కోస్తా ఆంధ్రప్రాంతాలను, వారి వాటాలను విభజిస్తూ ఎవరూ? ఎవరిని మోసం చేస్తున్నారనే అంశాన్ని కథగా మలచి రాయలసీమకు జరుగుతున్న మోసాన్ని తాగునీరు,సాగునీరు పంపకాలపై కోస్తా ప్రాంతం వారు చూపుతున్న వివక్షతను రచయిత స్పష్టంగా వ్యక్తికరించాడు. కర్నూలులో నివాస ముండే మహేష్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో ఉంటే ఎన్.ఆర్.పేట, నోబెల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు.పెద్ద కొడుకు రాఘవ,నడిపి కొడుకు నాగేశ్వర్లు వాళ్ళమ్మను చూడటానికి ముందుగానే ఆసుపత్రికి చేరుకొని ఉంటే, వాళ్ళమ్మకు పెద్ద కొడుకు రాఘవ నచ్చదు. వాడు ఎదురుగా ఉంటే నేను ఏ మందులు వేసుకోనని వెంటనే చిన్నకొడుకు ఉమామహేశ్వఉమామహేశ్వర్ ని పిలిపించమని పేచిపెడుతుంది. మహేష్ వాళ్ళమ్మ, ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే అష్టకష్టాలు పడుతూ, సి.క్యాంప్ చేరుకుంటాడు, అక్కడ నుండి ఉద్యమాల మానవహారాలే,అటు నుండి కృష్ణానగర్, బిర్లాగేట్, రాజీవ్ సర్కిల్, కలెక్టరెట్,హంద్రీనది బ్రిడ్జి ముందు శ్రీకృష్ణదేవ రాయల విగ్రహం,చేరే సరికి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎటు చూసినా ఉద్యమకారుల సెగ రక రకాల ప్రజాసంఘాల వాళ్ళు,ఉద్యోగ సంఘాలవాళ్ళు,ఎక్కడి వాహానాలు అక్కడే నిలబడి పోయాయి.మహేష్ వాహ నం నడుపుతూ ఒక్కొక్క అడుగు, అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. మహేష్ కు ఒక టెంట్ దగ్గర రాయలసీమ విద్యావంతుల వేదికలో నుండి-
జై....రా....జై..జై...రా.....సీమా
“ కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి......
పెద్దను దురన్యాయాన్ని చూడండీ
కళ్ళ తెరవండి కళ్ళ తెరవండి
యాభై యారెండ్లుగా మనకేం మిగిలింది
కరువూ కన్నీళ్ళు....
“మనదిగాని నగరాన్ని వదలనంటూవు
కళ్ళు తెరూ కళ్ళు తెరూ....
“నయ్ చోడింగే నయ్ చోడింగే కృష్ణా జల్ నయ్ చోడింగే…” నినాదాలు వినిపిస్తుంటే … మరొక వైపు రాజ్ విహార్ సెంటర్ లో జై రాయలసీమ నినాదంతో
“పెద్దన్నల మాయ మాటలు నమ్మకండి నమ్మకండి!
“కృష్ణ జలాలు రాయలసీను జన్మ హక్కు, జన్మ హక్కు”
పెద్దన్నల మాయోపాయాలు తిప్పికొట్టండి తిప్పికొట్టండి!-4 అని
నినాదాల్ని వింటుంటే, మహేష్ మనసులో ఆలోచనలు రాయలసీనుకు కృష్ణజలాలు విషయంలో మోసం చేస్తున్న విషయం పసిగట్టి తన అన్న కూడా మాయ మాటలతో ఇద్దరు అన్నదమ్ములను ఎలా మోసం చేస్తున్నాడని వాస్తవాన్ని తెలుసుకొన్నట్టే, రాయలసీమపై వివక్షతను ‘విభజనరేఖలు’ కథలో విభజనకారుల మోసాన్ని, స్వప్రయోజనాలను, స్వార్థపరుల దోపిడితన్నాన్ని ఎండగట్టాడు. (దేవరగట్టు (కథలు) విభజనరేఖలు: వెంకటకృష్ణ : పుట :119 )
4.5 సామాజికవిప్లవం:
కర్నూలు జిల్లాలోని ప్యాపిలి, నందికొట్కూరు, ఆత్మకూరు మండలాల గ్రామాల్లో ఉండే మాల, మాదిగ, శ్రీవారి, మంగలి, బతకు కులాల జీవితాల్నీ కథల్లోకి తీసుకొని వస్తువుగా మార్చిన రచయిత శ్రీనివాసమూర్తి. గ్రామాల్లోని సామాజిక సంబంధాల తీరును, పల్లెల తరతరాల సంబంధాలను తెలియపరుస్తూ, బయటి ప్రపంచం తో జరుగుతున్న ఆధునిక పరిణామాలతో గ్రామీణ ప్రాంతాల్లోకి పాకి స్వార్థపూరిత వ్యాపారాలు, రాజకీయాలు, దౌర్జన్యాలు, అణిచివేత వంటి ఆధిపత్య పోరుకు వ్యతిరేకంగా యువకుల్లో వచ్చిన విప్లవాత్మక ధోరణిని ‘సేధ్యం’ కథలో రాములు పాత్రలో చెప్పించాడు. కథకుడు, నల్లమల్ల అడవులకు సరిహద్దుగా ఉన్నీ మండలాలు ఆత్మకూరు, ప్యాపిలి, నందికోట్కూరు ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలు అణిచివేతకు గురైయి,ఎంగటాద్రినాయుడు,వారి నాయకులు మల్లారెడ్డి తో కలసి సారా వ్యాపారమంతా వాళ్ళే తీసుకుని పల్లెపల్లెలు దండోరా వేయించారు, బతుకు తెరువు కోసం సారాకాచి బతికే నీలిసికారోళ్ళు సారా కాయరాదని చెప్పడంతో రాములు మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపు నిస్తాడు. మల్లారెడ్డి ఎక్స్ చెంజ్ ఇన్స్ పెక్టర్ తో చేయి కలిపి గ్రామాల్లో యువ కుల్నందర్నీ కిడ్నాపు చేసి చంపేస్తుంటే అదికారులకి, వ్యాపారులకి మాత్రం విప్లవం గొడవలాగ కనిపిస్తుందిని ఎన్ కౌంటర్స్ మాత్రం తేలికగా తీసిపారేసి వాటి గురించి ప్రజాసంఘాలు చూసుకుంటూయని నిర్లక్ష్యపు సమాధానం మల్లారెడ్డి ఇప్పడంతో అవును మరి,
“మీకిది గొడవ లాగానే కనిపిస్తుంది, వందలాది మంది యువకులను శవాలు చేసి, తల్లిదండ్రులకు కూడా తెలయకుండా దహనం చేసినపుడు నీలాంటి ప్రజాస్వామిక వాదులు ఏమి మాట్లాడారు. గవర్నమెంటు కు ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం వూపుకొని వస్తారని”-5
రచయిత రాములుకి జరిగిన అన్యాయాన్ని బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న హింస కాండను ప్రశ్నిచాడు. సుబ్బయ్య లాంటి రైతుకు రాములు వంటి విప్లవ భావాలున్న వారసుడు కల్గడంతో కొడుకును కాపాడు కోలేక, ఇటు వ్యవసాయాన్నే పొగొట్టుకొనలేక యాభై మేళ్ళుగా సేధ్యం చేసిన రైతు సుబ్బయ్య వంటి వారి నుండి కూడా విప్లవాత్మక భావాలతో కూడిన మాటలకు పదునుండేలా పలికినాడు. శ్రీనివాసమూర్తి కథలో నక్సల్ ఉద్యమానికి యువత మొగ్గుచూపుతున్నారు. దీనికి కారణం కేవలం అణిచివేత, స్వార్ధ పూరితమైన ఆలోచనలకు నిలువుట్టద్దం. దోపిడి వ్యాపారమే అనే వాస్తవానికి ఊతమిచ్చాడు కథకుడు.(ఖబర్ కె సాత్(కథలు):సేద్యం: శ్రీనివాసమూర్తి: పుట:40)
4.6 ప్రాంతీయ ఫ్యాక్షన్లు:
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం, కలవంక గ్రామంలో రెండు రాజకీయ వర్గాల మధ్య దేవుని మాన్యం భూమి కోసం జరిగిన హత్యలతో కర్నూలు జిల్లా ప్రాంతీయ ఫ్యాక్షన్ కక్షలు గ్రామీణ సామాజిక జీవితాల మీద ఎంతగా ప్రభావితం చూపుతుందనడానికి ఒక ప్రతిబింబంగా రచయిత దేవుని మాన్యం కథను ప్రాంతీయ దృక్పథంతో చిత్రించాడు. గ్రామ సర్పంచుంగా ఎన్నికైన అంజిరెడ్డి కాంగ్రెసు పార్టీకి కొమ్ముకాస్తే, శాంతిరెడ్డి తెలుగుదేశం రామనాథం స్వామి, కమ్మూనిస్టు పార్టీ సిద్దాంతాలు కలిగిన పాత్రలుగా కథకుడు పరిచయం చేశాడు.. యిసీకాలు నాగిశెట్టి అనే కోమటి ఊరు ముందున్న రెండకెరాల భూమిన వుత్తరాది మఠానికి రాసిచ్చి ఆదోనికి చేరుతాడు శెట్టి. ఈ విషయం గ్రామస్తులకు ఎవరికీ తెలయక పోవడంలో ఆ గ్రామ సర్పంచ్ అంజిరెడ్డి పేరు మీద ఆడంగల్లోకి చేర్పించుకున్నందు వల్ల బెంగళూరులో ఉండే మఠం మేనేజర్ భూమి వివరాలు సేకరించి కోర్టుకి వెళ్ళితే తీర్పు మఠానికి అనుకూలంగా రావడంతో బెంగళూరులో ఉండే మర్గం మేనేజర్ భూమి వివరాలు సేకరించి మఠంకి తీర్పు అనుకూలంగా కావడంతో అంజిరెడ్డి ఈ దేవుని మఠం భూమి వివరాలు అందడానికి కారణమైన రామనాథం స్వామి, శాంతిరెడ్డి మీద పగ పెంచుకుంటారు. అదును చూసి రామనాథం స్వామి ఇంటి పై బాంబులతో దాడి చేసి విచక్షణా రహితంగా నరికి చంపుతారు.కలవంక గ్రామస్తుడైన సోమేషాచారి, రామనాథం క్లాస్మేట్ కావడంతో హత్య చేయబడ్డాడు అన్నవెంటనే చివరి చూపు చూడటానికి వచ్చిన సోమేషాచారి విగత జీవులుగా,శరీర భాగాలు తెగి వీధి సందుల్లో పడివున్న మిత్రుని శవాన్ని, శాంతిరెడ్డి శవాలన్ని చూసి తను పుట్టిన నేలమీద ఇంత స్థాయిలో కక్షలూ,పన్నాగాలు ఉన్నాయ అని ఆశ్చర్యపోయేలా రచయిత కథను నడిపించాడు.బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ కర్నూలు బతుకుదువు రారా అని పిలిస్తే వస్తానన్న రెండు రోజులకే శవంగా మారటంతో స్నేహానికి ఉన్న ప్రేమ గుండెల్ని పిండేస్తుంది. రామనాథం స్వామి తమ్ముడు శంకరయ్య వెంటరాగా శాంతరెడ్డి ఇంటికి బయలు దేరుతాడు శాంతరెడ్డి ఇంటి దగ్గక బయట మంచం మీద పడుకోపెట్టిన శవం కనిపిస్తుంది. రామకృష్ణ సోమేష్ ఆచారికి చెప్పుతున్నాడు. ఈవిధంగా.
“ఈ స్వామిదన్నాలు మేలు, శాంతరెడ్డి నయితే కొడుకు కండ్ల ముందే చంపినారు. సందు తిరిగిన మనుషుల్ని చూసి నాయినా! నాయినా! అని ఎచ్చరించే లోపల్నే మంచం మీద పడుకున్నాన్ని పడుకున్నట్టే నరికినారు, శాంతిరెడ్డి పిల్లోన్ని పట్టడం శానా కష్టమైంది మాటెత్తితే ఆనాకొడుకల్ని నరికొస్తానంటూ, ఏడుస్తూ, బార్లాడ్తాలు అదేం బలమో ఏమో గానీ ఆపిల్లోడు అంజిరెడ్డి మిద్దెను సగానికి సగం కూలగొట్ట్నాడు”-6
అంటూ శాంతిరెడ్డి యింటి వాతావరణాన్ని గ్రామిణ పరిస్థితులను, ఫ్యాక్షన్ కక్షలను రామకృష్ణ వివరిస్తూ ఉంటే సోమేషాచారి స్థాణువులా నిలబడి పోతాడు. రచయిత ప్రాంతీయ దృక్పథతో చిత్రించిన కథల్లో ప్రాంతీయత, మాండలిక భాష, యాష, పూర్తిలో స్థానికతను, ప్రాంతీయతను గుర్తించాడనేది కథా శిల్పానికి ఆయువు పట్టుగా చూపించాడు. (ఖబర్ కె సాత్ (కథలు): దేవుని మాన్యం: శ్రీనివాసమూర్తి: పుట:153)
4.7 సిద్ధేశ్వరం ప్రాజెక్టు:
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రాంత పరిస్థితులను పరిశీలించిన బ్రిటిష్ వారు కృష్ణానదిపై సిద్ధేశ్వరం గూడెం దగ్గర కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టాలని తీర్మానం తెలుగువాళ్ళ నీళ్ళు, తమిళం వాళ్ళకు ఇవ్వడం ఏమిటి స్వార్థపరులు రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టి సిద్ధేశ్వరం ప్రాజెక్టుకు బదులుగా నందికొండ దగ్గర నాగార్జున సాగర్ నిర్మాణం జరిపించుకోవడంలో కోస్తా ప్రాంతం వాళ్ళు తమ స్వార్థంతో ఎక్కడ సిద్ధేశ్వరం గూడెం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఎగువ ప్రాంతం నీరు తనుకు అందవని, మనం, మనం తెలుగుభాష వాళ్ళం అని చెప్పి, సాటి తెలుగు వాళ్ళం అనే భావం కూడా లేకుండా కృష్ణానదీ జలాలను నాగార్జున సాగర్కు తరలించుకుని వెళ్ళారు. అప్పడు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు....
“అన్నీ మాకే గావాల, కడుపు కొంచెం కూడా కాళీ కాకూడదు, బానపొట్ట బకాసురులు, మన వాళ్ళ పొట్టకి ఆహారాన్ని సప్లై చేయడానికి మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. డొక్కలు ఎండిపోయి, వీపులకు కడుపు అంటుకు పోయిన మన ప్రజలను గాలికి వదిలేసినారు”-7
అని పలికిన రైతుమాటతో కర్నూలు ప్రాంతరాజకీయనాయకులు, రాయలసీమ నాయకులు ఎంతలా అమ్ముడు పోయారనే వాస్తవ నిజం బహిర్గతమైంది. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తిరుగుబాటు జరుగు తుంటే, సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి చేయి చేయి కలసి అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలిన ఉద్యమకారుల్ని అడుగడుగు నా ఆపివేయడం, ఎండి పోయిన చెట్లు,మనుషులు తిరగని రాళ్ళు గుట్టల ప్రాంతంలో 144 సెక్షన్ అమలు పెట్టారంటే ఎంత తీవ్రమైన ప్రాంతీయ వివక్షతను చూపిస్తున్నారనేది తేటతెల్లమైంది.రెండు సందర్భాలు కథలో రచయిత్రి కె.సుభాషిణి కర్నూలు జిల్లా వాటా క్రింద నీటి పంపకంలో ప్రాంతీయ వివక్షత ఎలా చూపారనే సత్యాన్ని, వాస్తవాన్ని ప్రాంతీయ ప్రజల గుండెల్లోకి లోతుగా నాటుకు పోయే విప్లవ భావాన్ని వ్యక్త పరిచింది.
4.8 దళిత సాహిత్యం:
నిప్పులవాన కథాసంకలనంలో 15 కథలతో ప్రచురించబడింది. ఒక్కొక్క కథ కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలల్లో దళితుల జీవన విదానాన్ని వారి సంస్కృతిని వారు సమాజం పట్ల గురవుతున్న వివక్షతను, ఆదిపత్య వర్గాల వారిని అణివేస్తున్న తీరు, వంటి అంశాలను కథా వస్తువులుగా చిత్రంచి దళిత సాహిత్యానికి కథా ప్రక్రియలో గుర్తింపును తీసుకొచ్చారు సంపాదకులు కెంగార మోహన్. ఇందులో ఉన్న కథలన్నీ దళితుల జీవితాలనే వస్తువుగా స్వీకరించి రచించారు రచయితలు.గ్రామీణ ప్రాంతాలలో ఉండే దళితుల పట్ల భూసామ్యదారులు ఏవిధంగా ఉంటూ, లొంగదీసుకుని తమ చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకొని, కనీసం ప్రశ్చించే హక్కును,మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇవ్వకుండా,ఒక నిరంకుశత్వ ధోరణిలో గ్రామీణ ఆదిపత్యాన్ని చేలాయిస్తున్నారు అనడానికి మంచి ఉదహరణగా ‘కైమా’ కథలో రచయిత్రి మల్లెపోగు వెంకట లక్ష్మమ్మ చిత్రించింది.కథంతా కూడా నందికొట్కూరు సమీపంలో ఉండే తత్తూరుకి సంబంధించినది. మల్లయ్య, ఆదిలక్ష్మీ దంపతులకు జరిగిన అన్యాయం అనే దానికంటే దౌర్జన్యం అనే చెప్పవచ్చు.ఎందుకంటే మల్లయ్య ఆదిలక్ష్మీ దంపతులకు తత్తూరు రంగనాథస్వామికి ముడుపులు కప్పిడటం వలన లేకలేక కలిగిన ఒక్కొగానొక్క సంతానం. గ్రామానికి సర్పంచి అయిన వెంకటరెడ్డి ఇంట్లో మల్లయ్య పాలేరు, మల్లయ్య కొడుకు రంగనాథం పెరిగి పెద్దవాడవుతూ, చదువుతో పాటు, పొలాల్లో ఏపని కాదనకుండా, పని చేస్తూ ఊరందరి చేత మెప్పు పొందుతాడు. విషయం తెలిసిన వెంకటరెడ్డి మల్లయ్యకు ఇష్టం లేక పోయినా బలవంతంగా తనదగ్గరే పనికి ఉంచుకుంటాడు. ఒక రోజు వెంకటరెడ్డి ట్రాక్టర్ డ్రైవర్ రాకపోవడంతో రంగనాథంను వెంటేసుకొని పొలం పనులకు వెళ్ళి ట్రాక్టర్ తో పొలం దున్నుతున్నప్పుడు చక్రాలకు ఏవో మట్టిగడ్డలు అడ్డుపడితే తొలగించమని వెంకటరెడ్డి డ్రైవర్ సీటులో నుండే చెపుతాడు. రంగనాథం మట్టిగడ్డలను తొలగిస్తున్నపుడు ట్రాక్టర్ ను ముందుకు పోనీయడంతో చక్రం కింద పడి చనిపోతాడు రంగనాథం. ఈ విషయం బయటకు తెలిస్తే తను కేసులో ఇరుకుంటానని తెలిసి రంగనాథం. శవం మొత్తం ముక్కలు ముక్కలు అయ్యేలా ట్రాక్టర్తో తొక్కిస్తాడు. రోడ్డు మీద నుండి వెళ్ళుతున్న మల్లయ్య సామాజిక వర్గం వారు గమనించి విషయం చేరవేస్తే ఊరు ఊరంతా వ్యాపిస్తుంది. వెంకటరెడ్డిని రక్షించు కోవడాని వారి సామాజిక వర్గం అంతా ఒకవైపు కావడం,అధికార బలం, ధనబలంతో ఉండటంతో మల్లయ్య, ఆదిలక్ష్మి దంపతులు చివరకు తను కొడుకు శవానైనా చూపించండని ప్రాదేయపడినా తమకు తెలియదు తమదగ్గరికి పనికి రాలేదని దౌర్జన్యంలో ఎదురుతిరిగి మాట్లాడుతారు. గ్రామస్తులంతా వెంకటరెడ్డి పొలంకేసి చూస్తుంటే
“అక్కడ గుంపులు, గుంపులుగా పిచ్చుకలు, కాకులు, రాబందులు, గ్రద్దలు ముక్కులతో పొలంలో పొడుస్తూ మాంసంను తంటున్నాయి. కుక్కలు ముక్కుతో వాసనను చూస్తూ నేలనంతా త్రవ్వి ఉంటున్నాయి, రెండు కుక్కలు రంగనాథ్ చొక్కాను నోట కరుచుకొని గుంజు కుంటున్నాయి, ఆ దృశ్యాలను చూసినవారందరూ కన్నీరు పర్యంతమువుతారు”-8
ధనం, అధికారం చేతిలో ఉంటే పేదవాడు, పనివాడు, ఎప్పుడూ భూస్వామ్యదారుల దృష్టిలో చిన్న చూపుగానే చూస్తారనే విషయాన్ని రచయిత్రి తీర్చిదిద్దిన తీరు దళిత వివక్షతకు ప్రతీకగా కనబడుతుంది.(నిప్పుల వాన కథా సంకలనం : కైమా : పుట : 58)
5. ముగింపు:
ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో విభిన్నమైన కథా వస్తువులు చోటు చేసుకొని వైవిధ్యవైన దృక్పథాలతో కథా సాహిత్యంలో ప్రవేశించాయి. అందులో కర్నూలు జిల్లా కథా సాహిత్యంలో కూడా భిన్నమైన పార్వర్శాలను స్పృజింపజేస్తూ కథలు వెలువడ్డాయి. ఈ కథలన్నింటినీ పరిశోధన విధానంలో విశ్లేషణ పద్ధతిలో పరిశోధించడము వలన అనేక సామాజిక వైశ్య మాలు, వైఖరులు, ధోరణులు తారసపడతాయి. ముఖ్యంగా-
- కర్నూలు జిల్లాలోని ప్రాంతీయంగా ఉండే సామాజిక జనజీవనం,సమస్యలు,సాంఘిక పరమైన వైఖరులు వ్యక్తమవుతాయి.
- ఒక దశాబ్ద కాలంలో వచ్చిన కథా ప్రక్రియల్లో కనబరిచిన కథా వస్తువు యొక్క ఉద్దేశ్యం, రచయిత ఆలోచనలు తెలుస్తాయి.
- 2011-2020 ఒక దశాబ్ద కాలంలో వచ్చిన కథా రచనలు, కర్నూలు జిల్లా సాహిత్యంలో చూపిన ప్రాంతీయ లక్షణాలు.
- ప్రాంతీయ తత్వభావనకు బలం చేకూర్చే వస్తువును కానీ, భాషను గానీ, ప్రాంతీయ యాసను ఏమేరకు ప్రయోగించారనేది స్పష్టమవుతుంది.
- సమాజంలోని సామాజిక జీవనానికి, మారుతున్న నాగరిక ప్రపంచంతో సంబంధాలు అను సంధానంగా ఉన్నాయా లేదా? అనే ఆలోచనల్నీ రేకెతిస్తాయి.
- ప్రాంతీయ దృక్పథంతో, స్థానిక వస్తువుతో చిత్రించిన కథలో ప్రాంతీయతకు బలాన్ని చేకూర్చు తుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలుగా ఈ కథా ప్రక్రియలు కనిపిస్తాయి.
- ప్రపంచీకరణ స్థాయిలో ప్రాంతీయత స్థానం ఎక్కడ ఉంటుంది అనే ఆధునిక సత్యానికి దారులు వెతుకుటకు ఈ కథా సాహిత్యం ఉపయోగకారిగా కనిపించటం.
6. పాదసూచికలు:
- నేరేడు రంగు పిల్లవాడు కథలు,ఔట్ ఫ్లో,పినాకపాణి, పుట. 85
- పరాయోళ్ళు కథలు,పరాయోళ్ళు,జి.ఉమామహేశ్వర్, పుట.15
- ఊరిమర్లు కథలు,కెంపు,మారుతి పౌరోహితం, పుట.108
- దేవరగట్టు కథలు,విభజనరేఖలు,వెంకటకృష్ణ, పుట.119
- ఖబర్ కె సాత్ కథలు,సేద్యం,శ్రీనివాసమూర్తి, పుట. 40
- ఖబర్ కె సాత్ కథలు,దేవుని మాన్యం,శ్రీనివాసమూర్తి, పుట.153
- సిద్దేశ్వరం అడుగు కథలు,రెండు సందర్భాలు,కె.సుభాషిణి, పుట.24
- నిప్పుల వాన కథా సంకలనం,కైమా,మల్లెపోగు వెంకట లక్ష్మమ్మ, పుట.58
7. ఉపయుక్తగ్రంథసూచి:
- ఉమామహేశ్వర్, జి. (2017). పరాయోళ్ళు కథలు. పాలపిట్ట బుక్స్, హైదరాబాద్.
- గోపాల్ రెడ్డి, కొప్పులు. (2014). మన కర్నూలు జిల్లా. మహాత్మ ప్రెస్, కర్నూలు.
- చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం.(2013). మన నవలలు మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
- నారాయణ స్వామి, బండి.రాయలసీమ సమాజం సాహిత్యం(2019),పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్.
- పాణి. (2020). నేరేడు రంగు పిల్లవాడు కథలు. విప్లవ రచయితల సంఘం, కర్నూలు.
- మారుతి పౌరోహితం. (2022).ఊరిమర్లు కథలు. రాయలసీమ ప్రచురణలు, కర్నూలు.
- మోహన్ కెంగార.(2020). నిప్పుల వాన కథల సంకలనం. మనస్విని ప్రచురణలు, కర్నూలు.
- వెంకటక్రిష్ణ, జి.,మారుతి పౌరోహితం.(2020).సిద్దేశ్వరం అడుగు కథలు రాయలసీమ ప్రచురణలు, కర్నూలు.
- వెంకటక్రిష్ణ. జి.(2020). దేవరగట్టు కథలు. లిఖిత ప్రెస్ ,హైదరాబాద్.
- శ్రీనివాసమూర్తి. (2021). ఖబర్ కె సాత్ కథలు. తుంగభద్ర ప్రచురణలు, కర్నూలు.
- శ్రీదేవి. కె. (2016). సీమకథ అస్థిత్వం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
- శ్రీదేవి. కె. (2017). కథ విమర్శ, విశ్లేషణ. ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ.
- శ్రీధర్, వెల్దండి.(2015). తెలుగుకథ ప్రాంతీయ అస్తిత్వం. తెలుగు అధ్యయన శాఖ, సిల్వర్ జూబ్లీ కళాశాల (స్వ) కర్నూలు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "JUNE-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-May-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు
మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "JUNE-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.