headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797

8. అనంతపురం జిల్లా నలుగు పాటలు: సాంఘిక ఆచారాలు

anke_suresh
అంకె సురేష్ కుమార్

పరిశోధక విద్యార్థి, తెలుగు మరియు తులనాత్మక సాహిత్యశాఖ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురము, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7382584272. Email: sureshanke75@gmail.com

prof_g_narasimhan
ఆచార్య జి. నరసింహన్‌

ఆచార్యులు, తెలుగు మరియు తులనాత్మక సాహిత్యశాఖ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురము, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9000127115. Email: gnnnaga11@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు జానపద గేయ సాహిత్యంలో నలుగు పాటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన కాలం నుంచి నోటి మాట ద్వారా ప్రచారంలో ఉన్న ఈ గేయాలలో సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మొదలైన అంశాలు ఎన్నో దాగి ఉన్నాయి. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల ఆచార వ్యవహారాలు సాంస్కృతి సాంప్రదాయాలలో వ్యత్యాసం ఉంది. కాని ఇరువురి ప్రాంతప్రజల మధ్య ఉండే సత్సంబంధాలు, రాకపోకల వలన ఆచారాలు, సంప్రదాయాలు కలిసిపోయాయి. దీనివలన ఈ రెండు ప్రాంతాలలోని ఆచారాలు, సంప్రదాయాలు కొత్తరంగు పులుముకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలలోని స్త్రీలు పాటించే సాంఘిక ఆచారాల గురించి తెలుసుకోవడం వ్యాసం ప్రధాన ఉద్ధేశం. నేను ఈ పరిశోధనకుగాను క్షేత్ర పర్యాటనద్వారా కొంత సమాచారాన్ని సేకరించడం తో పాటు ప్రామాణిక ద్వితీయ గ్రంధాలలోని సమాచారాన్ని ఉపయోగించి విశ్లేషణాత్మక పద్దతిలో నా వ్యాసం కొనసాగుతుంది.

Keywords: సంస్కృతి సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు, షోడశ సంస్కారాలు, సమర్థ, నలుగు పెట్టడం, కంబళి.

1. ఉపోద్ఘాతం:

'వాఘ్నమం జాతి జీవన ప్రతిబింబం'1 అనే ఆర్యోక్తి సాహిత్యం గురించి ఉంది. అనగా ఏ జాతి సాహిత్యం ఆజాతి ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తుందని అర్థం. ఈ వాక్యం జానపద సాహిత్యానికి బాగా వర్తిస్తుంది. జానపద కవులు తాము చెప్పే సాహిత్యంలో తమ చుట్టూ ఉన్న ప్రజల జీవన విధానం, సాంఘిక విషయాలు, ఆచార వ్యవహారాలు,సంస్కృతి సాంప్రదాయాలు మొదలైన విషయాలన్నింటినీ వివరించడం జరుగుతుంది. తమ చుట్టూ లోకంలో జరుగుతున్న సమస్త విషయాలను తమ సాహిత్యంలో చెబుతారు. మనం నివసిస్తున్న సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి. జానపద సాహిత్యం ఈ రెండింటిని సమాన దృష్టితో స్వీకరిస్తుంది. ఆసురచనలైన జానపద గేయాలు మౌఖిక సాంప్రదాయంతో జీవిస్తాయి. మౌఖిక సాంప్రదాయానికి చెందిన సాహిత్యం అక్షర సాహిత్యం కన్నా ప్రాచీనమైనది, మరియు ఎక్కువ ప్రాధాన్యం కలది అని చెప్పవచ్చు.

2. సమాజంలో స్త్రీల స్థానం :  

ఒక దేశ నాగరికతను, సంస్కృతిని అవగాహన చేసుకొనుటకు ఆదేశమున స్త్రీలకు గల స్థానంపై అధ్యయనం చేయాలి. హిందూ సమాజంలో స్త్రీలకు అత్యున్నత గౌరవం ఇవ్వబడింది. గృహపత్నిగా, కుటుంబాన్ని పాలించు అధికారినిగా వేదములలో పేర్కొనబడింది.

"గృహన్ గచ్ఛ గృహపత్నియథాసోవశీనీత్వంవివిధమావదాసి
ప్రతితిష్ట విరాడసి విష్ణు రివేహ సరస్వతి"2   -   ఋగ్వేదము

"తస్యాం త్వరోచమానాయాం సర్వయోవనరోచతే"3 -   మనుస్మృతి

స్త్రీకి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భర్తలు వారి వారి శ్రేయస్సు కొరకు దుస్తులు, ఆభరణములు ఇచ్చి సంతోష పెట్టవలెను అని మనుస్మృతిలో చెప్పబడింది. ఎచ్చట భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో అక్కడ సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి. భార్య సంతోషంగా ఉన్నట్లయితే ఆ ఇంటిల్లిపాది సంతోషం వెళ్ళివిరిసినట్లే, అసౌఖ్యంగా ఉండినయడల ఆ గృహమంతయు అసౌక్యంతో కూడి ఉంటుంది. దీనిని బట్టి స్త్రీ ఆరాధ్య దేవత అని తెలుస్తుంది.  స్త్రీని ప్రకృతి తోను, మాయతోను, భూమాత తోను వేదములు, స్మృతులు, పురాణాలు పోల్చినవి జానపద సాహిత్యంలో కూడా ఇలాంటి పోలికలు మనం గమనించవచ్చు. జీవిత రథమునకు భార్య భర్తలు రెండు చక్రములు లాంటివారు. స్త్రీని అర్ధాంగిగా పేర్కొనటం మనందరికీ తెలుసు. ఒక రష్యన్ సామెత ప్రకారం పురుషుడు కుటుంబానికి తల లాంటివాడు కాగా స్త్రీ ఆ తలను నిలబెట్టే మెడ వంటిది.

మన పురాణ ఇతిహాసాలు భర్త ప్రాధాన్యమును చాటుచున్నవి. పత్నికి పతియే ప్రత్యక్ష దైవము. సర్వస్వమును పరిత్యజించి  భర్తనే ఆరాధింపవలెను.

"భర్తదేవో గురు: భర్త ధర్తీర్థవ్రతానిఛ
 తస్మాత్సర్వం పరిత్యజ పతిమేకం సమర్చయేత్"- స్కాంద పురాణం, కాశీఖండం

3. నలుగు పాటల్లో సాంఘిక విషయాలు   :     

జానపద సాహిత్యంలో స్త్రీల పాటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్త్రీల పాటల్లో కవిత్వం మధురాతి మధురంగా ఉంటుంది. ప్రజలందరినీ రంజింపజేసే ఈ గేయాలు మన దేశ నాగరికత సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అడుగడుగునా గుర్తుకు తెస్తాయి. స్త్రీ నెరవేర్చాల్సిన ధర్మాన్ని, వేదాలు పురాణాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ గేయాలు బోధిస్తాయి. జానపద గేయాలు ఊహకు తావు లేకుండ సహజ సుందరమైన పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే మధుర భావనలతో జానపదుల హృదయాల్లోకి చొచ్చుకు పోతాయి.

కన్నడ భాష ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. చారిత్రకంగా సాంస్కృతికంగా ఈ జిల్లా ప్రాశస్త్యము పొంది ఉండడం వల్ల సాంప్రదాయక స్త్రీలలో సంప్రదాయక పాటలు,  వేడుక పాటలు,   కథలు, పౌరాణిక పాటలు చోటుచేసుకున్నాయి. అనంతపురం జిల్లా కర్ణాటక రాష్ట్రానికి పక్కనే ఉండడం వల్ల కన్నడ ప్రజల కట్టుబాట్లు, నడవడిక, భాష, సంస్కృతి ఈ జిల్లా స్త్రీలను ఎక్కువగా ఆకర్షించాయి. స్త్రీల పాటల్లో సమర్ధ పాటలు,  పెండ్లి పాటలు, నలుగు పాటలు,  అప్పగింతపాటలు, తలుపు దగ్గర పాటలు, బంతులాట పాటలు, సీమంతం పాటలు,వరస పాటలు మొదలైన గేయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.  స్త్రీలు వీటిని  ఆయా సందర్భాలకు అనుగుణంగా పాడుతారు.

3.1 సమర్థ పాటలు :     

సమర్థ అను పదానికి  స్త్రీ ప్రథమ రుతువు అని అర్థం.  అనగా తొలిముట్టు. రుతుమతి అయిన బాలికను రసజ్వల అని, పుష్పవతి అని కూడా పిలుస్తారు. అయితే అనంతపురం జిల్లాలో సమర్థను పెద్దమనిషి అయిందని,పిల్ల ఎదిగిందని  అంటారు. దాదాపు 12,  13 సంవత్సరాల వయసులో బాలిక రసజ్వల అవుతుంది.  ఇంగ్లీషులో సమర్థను 'puberty '  అని పిలుస్తారు.  Puberty అనగా   'age of adult hood' (it is a period when the reproductive organ's mature and begin of function).

హిందూ సంప్రదాయం ప్రకారం సమర్థ ఆయన బాలికను అసుచిగా భావించి మూడు రోజులు ప్రత్యేక గదిలో ఉంచుతారు. రసజ్వల  అయిన బాలికను తాకకూడదని ఆంధ్ర మహాభారతంలో కూడా కలదు.

"నక్కోమలి రసజ్వల నన్ను ముట్టకు" -  సభాపర్వం ద్వితీయ శ్వాసం

ప్రథమంగ రసజ్వల అయినప్పుడు తిధి,వార,నక్షత్రాలను బట్టి   శుభ, అశుభాలను చూడడం జానపదుల్లో కలదు. అనంతపురం జిల్లాలో సాంప్రదాయక స్త్రీలలో వార ఫలాలను గూర్చిన నమ్మకాలు క్రింది విధంగా ఉన్నాయి.

         అల్లో నేరేడల్లో వెలది రుక్మిణి సమర్థ వేడుకలాయ
         అల్లో నేరేడల్లో ఆదివారము నాడు అతిరోగి అగును
         అల్లో నేరేడల్లో సోమవారము నాడు శుభ ప్రతివ్రత
         అల్లో నేరేడల్లో మంగళవారమునాడు మతిమతురాలు
         అల్లో నేరేడల్లో బుధవారము నాడు బుద్ధిమతి అగును
         అల్లో నేరేడల్లో  బేస్తవారము నాడు పుత్రవతి అగును
         అల్లో నేరేడల్లో శుక్రవారము నాడు శుభతి సంపద కలిగి యుండు
         అల్లో నేరేడల్లో శనివారము నాడు సతిపేదరాలు - పాడినవారు శ్రీమతి జానకమ్మ, కదిరి.

పై గేయంలో పుష్పవతి అయిన బాలికను రుక్మిణి దేవితో పోల్చినారు. ఈనాటి ప్రజలు తమ ఆచార వ్యవహారాలకు  పురాణ పాత్రలను జోడించి పాటలు పాడుతున్నారు. పూర్వకాలం నుంచి ఇటువంటి ఆచారాలు మనకి ఉన్నాయి అనే విధంగా పాటలు కట్టి పాడినారు మన పెద్దలు. ఈ గేయాల వల్ల జానపదులలో జ్యోతిష్య పరిచయం, నమ్మకాలు మొదలయినవి తెలుస్తున్నాయి.

సమర్థఅయిన బాలికకు పేరంటం చేయడానికి మంచి రోజులు నిర్ణయిస్తారు. బంధువులకి ఇరుగుపొరుగు వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారు. పేరంటానికి ముందు సమర్థ అయిన స్త్రీకి విలువైన పట్టుబట్టలను కట్టబెట్టి,ఆభరణాలు వేస్తారు. ఇంటి ముందు అలికి ముగ్గువేసి   ఆస్థలంలో కుర్చీమీద  కూర్చోబెడతారు. పుష్పవతి అయిన స్త్రీకి ఎదురుగా అక్కడకి వచ్చిన  స్త్రీలందరు కూర్చోని ఆ యువతితో సంబంధభాంధవ్యాలు పురస్కరించుకొని పాటలు పాడుతారు. ఆయింటికి కోడలువరుసైన వారు అమ్మాయిని, ఆయింట్లో వారిని హాస్యం చేస్తు పాటలు పాడుతారు.

ఉదా :

         ధరణి సమర్థలాడె నని తల్లితోనే చెప్పుకునే
         చెప్పుకొనక రాక ధరణి తలాలొంచి నవ్వేనమ్మ
         సుయన సుయన పాడరమ్మ సుందరాంగుల చూడరమ్మ
         నా మాటగాదె బొమ్మ నాది సమర్థ లాడెరమ్మ
         పట్టు చీరలు తెచ్చినారు దాయద్రాచ్చకిచ్చినారు
         పట్టు రైకలు తెచ్చినారు దాయ ద్రాచ్చకిచ్చినారు
         కట్టుకునెకి రాక ధరణి తలాలోంచి నవ్వెనమ్మ
         కట్టుకునేకి రాక ధరణి తలాలొంచి నవ్వెనమ్మ
         దండి సొమ్ములు తెచ్చినారు దాయ ద్రాచ్చకిచ్చినారు
         ధరణి కుంకుమ తెచ్చినారు దాయ ద్రాచ్చికిచ్చినారు
         పెట్టుకునెకి రాక ధరణి తలాలొంచి నవ్వేనమ్మ
         పెట్టుకునెకి రాక ధరణి తలాలొంచి నవ్వేనమ్మ
         సుయన సుయన పాడరమ్మ సుందరాంగుల చూడరమ్మ
         నా మాట కాదు బొమ్మ నాది సమర్థ లాడెరమ్మ. - పాడినవారు నరసమ్మ, గూళ్యం

బాలిక సమర్థ అయిన మొదటి రోజున ముత్తైదువులు నీళ్లు పోసి పసుపు కుంకుమ పెడతారు. చాకలి స్త్రీ దడెము తీసుకువస్తుంది. దడెమును పరిచి నాలువైపులా మరియు మధ్యభాగంలో ఆకు, వక్క, బెల్లం పెడతారు. వసంతము కలిపి దడెముకు నాలువైపులా, మధ్యభాగంలో పూస్తారు. బాలికను దుష్ట గ్రహాల నుంచి రక్షించడానికి ఇలా చేస్తారు. దడెము మీద ఉన్న బాలికకు కొబ్బరికాయ తో దిష్టి తీసి  దాన్ని పగలగొడతారు. ఈ విధంగా వీరి ఆర్థిక స్థితిని బట్టి  మూడు ,ఐదు, ఏడు, తొమ్మిది రోజులు పాటు సాయంత్రంవేళ పేరంటము చేస్తారు. పుష్పవతి అయిన బాలికను తొమ్మిది రోజులు పాటు ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వరు. మొదటి ఐదు రోజులు భోజనంతో పాటు చలిమిండి,నెయ్యి, పులగము తినిపిస్తారు. వేడుక జరిగిన ప్రతిరోజు  అక్కడికి వచ్చిన ముత్తైదువులు బాలికకు పసుపు పూసి,గాజులు తొడిగిస్తారు. ఇలా పసుపు పూస్తున్న సమయంలో అనేక పాటలు పాడుతారు. ఈ నలుగు పాటలని పెళ్లికూతురు లేదా పెళ్లి కొడుకుని  చేస్తున్న సమయంలోను అలాగే సీమంతం చేస్తున్న సమయంలో కూడా పాడుతారు. ఇలా పేరంటం ముగిసిన తర్వాత పేరంటానికి వచ్చిన ముత్తైదువులందరికి తాంబూలం, పసుపు కుంకుమ, మరియు రవిక గుడ్డను ఇచ్చి పంపిస్తారు.

3.2. పెండ్లి పాటలు : 

సమాజంలో స్త్రీ పురుషులు దంపతులు అనిపించుకోవడానికి జరగవలసిన సంస్కారం వివాహం. 'షోడశ సంస్కారాల'లో ఇది ఒకటి. వివాహం అనేది స్త్రీ,పురుషులను ఇద్దరినీ ఒకటిగా చేయు ఒక పవిత్ర బంధం.మానవ జీవితంలో వివాహం చేసుకోవడానికి మూడు ప్రధానమైన కారణాలు చెప్పవచ్చు. అవి 1. వంశోత్పత్తి, 2. మోక్ష సాధనము, 3. రతి.  కామవాంచ జీవిత పరమ ద్యేయం కాదు, జీవితం నందు అనేక అవసరాలలో లైంగిక వాంఛ ఒక అంశం మాత్రమే. రతి పారామార్థికంగా పితృ సంబంధమైన రుణములను తీర్చుకొనుటకు సాధనమైనది కనుకనే పున్నామ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడు అనే మాట వచ్చింది. కాబట్టి వివాహం నుండి గ్రహింపవలసినది కామము ఒక్కటే కాదు, ధర్మార్థ కామముల సమన్వయమును సమకూర్చు సంయోగమే వివాహం అని అనిపించుకుంటుంది.

వివాహంలో ప్రతి ఘట్టానికి పాటలు కలవు.  ప్రధాన ఘట్టములను బట్టి  వీటిని   తలంటు పాటలు, నలుగు పాటలు,తలంబ్రాలు పాటలు, బంతులాట పాటలు, హారతి పాటలు, అప్పగింతల పాటలు, తలుపు దగ్గర పాటలు  అంటూ మొదలైన పాటలను చెప్పుకోవచ్చు.

వివాహం మొదటిరోజును పసుపు రోజు లేదా తొలి పసుపు అని పిలుస్తారు. తర్వాత ఇంటి ముందు పందిరి వేసి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. పందిరి మధ్య (నవ వరున్ని లేదా నవ వధువుని కూర్చోబెట్టు స్థలం) లో పసుపు నీళ్లతో కడుగుతారు. పందిరి కింద కంబలిని (గొర్రె వెంట్రుకలతో తయారు చేసిన ఒక వస్త్రం) పరచి  దానిమీద  బియ్యముతో ముగ్గు వేస్తారు. ఆ ముగ్గుమీద పీఠను వేసి పెళ్లికూతుర్ని లేదా పెళ్లి కుమారుడిని కూర్చోబెట్టి నలుగు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా నలుగు పెట్టే సందర్భంలో పెళ్లి కుమారున్ని శ్రీరాముడు గాను పెళ్లికూతుర్ని సీతగాను భావిస్తారు. పెళ్లి కుమారుడికి వరుసకి  అత్త అయ్యేవారు మొదట,  తరువాత  ఐదు, ఏడు, తొమ్మిది మంది  ముత్తైదువులు నలుగు పెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో పెళ్లి కుమారునికి ఒళ్లంతా పసుపుతో పూస్తారు. (పసుపు పూయడం వల్ల శరీరంలో ఉన్న క్రిమి కీటకాలు మొత్తం చనిపోతాయి, పసుపు యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది కాబట్టి). ఈ విధంగా నలుగు పెడుతూ పాడుతారు, వీటినే నలుగు పాటలు అంటారు.

ఉదా :

         సివ్వున విల్లు ఇరసి సీతను పెండ్లాడి
         సివ్వున విల్లు ఇరసి సీతను పెండ్లాడి
         శ్రీరాములాయియోద్య చేరిన రాములు
         నలుగీడ రారా దశరథా తనయుడా నలుగిడ రారా
         లంకకు రాజువయ్యే రాముల సురని జంపి
         లంకకు రాజువయ్యే రాముల సురనిజంపి
         రఘురాములాయియోధ్య చేరిన రాములు
         నలుగీడ రారా దశరథ తనయుడా నలుగిడ రారా
         సన్నామల్లెలు చామంతిపువ్వులు
         సన్నామల్లెలు చామంతిపువ్వులు
         సరములు గూర్చెదా నీమెడకేసెద
         నలుగీడరారా దశరథాతనయుడా నలగీడరారా
         పాచ్చిదవనము పరిమళగంధము
         పాచ్చిదవనము పరిమళ గంధము
         నీ మెడపూసెదా నిన్నె పూజించెద
        నలుగీడ రారా దశరథాతనయుడా నలుగీడ రారా - పాడినవారు మందల లక్ష్మీదేవి, గూళ్యం

పైగేయంలో పెళ్ళికొడుకుని చేసేటప్పుడు పసుపు పూయడం, గంధం పూయడం, అనేకరకాల పూలను మాలలుగా కట్టి వాటిని వరుని మెడన అలంకరించడం మొదలయిన విషయాలు వివరించడం జరిగింది.  రామాయణంలోని ప్రధానమైన ఘట్టాలను నలుగు పాటల్లో చేర్చి పాడడం వల్ల జానపదులకు సీతారాముల పట్ల ఉన్న భక్తి భావం వ్యక్తం అవుతుంది. అలాగే సీతారాములు జానపదుల నిత్య జీవితంలో ఏ విధంగా భాగమయ్యారో తెలుస్తుంది.

ఈ సంస్కృతి సాంప్రదాయాలను కొన్ని వందల సంవత్సరాల నుండి మన ఆచారాల్లో భాగంగా కొనసాగిస్తూ వస్తున్నాం.  ఇలాంటి ఆచారాల వల్ల మన పూర్వీకుల  జీవన విధానం మనకు క్షుణ్ణంగా తెలుస్తుంది.

4. ముగింపు:

ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయాలను జానపదులు ఎంతో నమ్మకంతో నిర్వహిస్తారు.  ఈ వేడుకలు పల్లె ప్రజల జీవితాలలో భాగమైపోయాయి.  ఉన్నవారు, లేనివారు, సాంప్రదాయ ప్రజలు, జానపద ప్రజలు అనే భేదం లేకుండా అందరూ ఈ ఆచారాలను పాటిస్తారు. తరతరాలుగా మన పూర్వీకుల నోట నలిగిపోయిన ఈ పాటలు మన తల్లుల కాలం నాటికి సగం తగ్గిపోయాయి.  నేటి స్త్రీల కాలానికి నేర్చుకునే ఆసక్తిగాని, పాడాలనే తాపత్రయం కానీ అస్సలు లేదు. తరతరాలుగా స్త్రీలు మన ఆచార వ్యవహారాలను, నమ్మకాలను, పాటలను రక్షించినారు అనుటలో ఎలాంటి సందేహము లేదు కానీ ఇకపై వీటిని రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  నేడు మనం జీవిస్తున్న ఈ యాంత్రిక కాలంలో ఆచారాలను, సాంప్రదాయాలను పట్టించుకోకపోవడం,  నేటి సినిమా ప్రపంచంలో సినిమా పాటలకు ఉన్నంత ఆదరణ జానపద గేయాలకు లేకపోవడం,  కవులు రచయితలు మొదలైన వారు జానపద సాహిత్యానికి గాని జానపద గేయాలకు గాని విలువ ఇచ్చి సాహిత్యాన్ని రచించేవారు ఎక్కువగా లేకపోవడం మొదలైన కారణాలు ఎన్నో జానపద గేయాలు ప్రచారానికి నోచుకోక మరుగునపడడానికి కారణాలు అవుతున్నాయి.

5. పాదసూచికలు:

  1. తెలుగు జానపద విజ్ఞానం ఆంధ్ర యూనివర్సిటీ- పూట 247
  2. స్త్రీల పాటలు అనంతపురం మండలం -జి ఎస్ మోహన్ - పుట 6
  3. స్త్రీల పాటలు అనంతపురం మండలం -జి ఎస్ మోహన్ - పుట 7
  4. స్త్రీల పాటలు అనంతపురం మండలం -జి ఎస్ మోహన్ - పుట 67

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆంధ్రుల జానపద విజ్ఞానం ఆర్ వి ఎస్ సుందరం- 1983
  2. జానపద గేయాలు- సాంఘిక చరిత్ర బిరుదురాజు రామరాజు నాయని కృష్ణకుమారి 1974
  3. తెలుగు జానపద విజ్ఞానం (ఆంధ్ర యూనివర్సిటీ) -2021
  4. స్త్రీల పాటలు అనంతపురం మండలం డాక్టర్ జి ఎస్ మోహన్- 1982

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]