headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797

4. “హరిశ్చంద్ర నలోపాఖ్యానం”లో “ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేష”: ఒక పరిశీలన

dr_k_udaykiran
డా. ఉదయ్ కిరణ్ కళ్లేపల్లి

సహాయ ఆచార్యులు (ఒ),
తెలుగుశాఖ, డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం,
ఎచ్చెర్ల, శ్రీకాకుళం - 532402, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494188200. Email: udaykiran188200@gmail.com
Download PDF


(ఔచిత్యమ్ - పరిశోధనవ్యాసరచన పోటీలు-2023లో ప్రచురణకు స్వీకరించిన విశిష్టవ్యాసం)


వ్యాససంగ్రహం:

శ్లేష రచనలో తనదైన ముద్ర వసి, అసమాన ప్రతిభాపాటవాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రామరాజ భూషణుని రచనలలో ఒకటయిన “హరిశ్చంద్రనలోపాఖ్యానం” ద్వ్యర్థి కావ్యంలోని శ్లేష చమత్కృతిని విభిన్నరీతిలో పరిశీలించటానికి చేసిన ప్రయత్నమే ఈ పరిశోధనా వ్యాసం. సాధారణంగా ఒక్కొక్క కవికి ఒక్కొక్క రచనాప్రణాళికా ఉండటం సహజం. ఆయా కవుల రచన దాని ప్రకారమే సాగుతుంది. అయితే ఒక కవి వేసుకున్న ప్రణాళిక ఆధారంగా వేరొక కవి రచనను పరిశీలించటమే నా ఈ పరిశోధనపత్ర విషయం. రాయలయుగంలో రామరాజభూషణుని కన్నా ముందే ద్వ్యర్థికావ్యరచన చేసిన పింగళి సూరన తన కావ్యంలో శ్లేషను ఆరు విధాలుగా వ్యక్తం చేస్తానని ప్రకటించుకున్నాడు. రామరాజ భూషణుని కావ్యంలో శ్లేషను పింగళి సూరన ప్రకటించిన ఆరు శ్లేషలలో ఒక శ్లేషవిధానం (ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష) ద్వారా పరిశీలించే ప్రణాళికను ఈ పరిశోధనా వ్యాసంలో పొందుపరిచాను. ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష విధానాన్ని స్వీకరించినందున అటు హరిశ్చంద్రకథలో ఇటు నలోపాఖ్యానంలో ఏయే పదాలు ఒక అర్థం సంస్కృతంలో, వేరొక అర్థం తెలుగులో కలిగి ఉన్నవో అటువంటి ప్రయోగాలను రెండు కథల ఆధారంగా తులనాత్మకంగా పరిశీలించాను. కేవలం సంస్కృత ఆంధ్ర పదాలను ఆయా కథలకు అనుగుణంగా ఏ విధంగా ప్రయోగించారో వివరించే ప్రయత్నంగా ఆరంభమయిన ఈ పరిశోధనా వ్యాసంలో సంస్కృతాంధ్ర పదాలు కొన్ని యెడల సభంగంగా, కొన్ని యెడల అభంగంగా ఏర్పడటం గమనించాను. ఒక అర్థములో అచ్చ తెనుగు, ఒక అర్థములో వైకృతమును అగు పదాలయిన ఉభయ వైకృత విశేష్యాలను రామరాజభూషణుడు ఈ ద్వ్యర్థికావ్యంలో నిక్షిప్తం చేసిన కొన్ని ప్రయోగాలు అక్కడక్కడా తళుకుమన్నాయి.

Keywords:రామరాజభూషణుడు, సూరన, ద్వ్యర్థికావ్యం, హరిశ్చంద్రనలోపాఖ్యానం, శ్లేష, ఉదయ్ కిరణ్

1. ఉపోద్ఘాతం:

రామరాజభూషణునిగా బిరుదునొందిన మూర్తీకవి బహుముఖప్రజ్ఞాశాలి. శతావధానం, ఘడియకు నూరు అనుష్టుప్ శ్లోకాలు చెప్పగల ప్రతిభ, ఆశు, బంధ కవిత్వాల నైపుణ్యం, కేవల ఓష్ఠ్య, నిరోష్ఠ్య, అచలజిహ్వ, అంతస్థోష్మాది పద్యాలను సులువుగా చెప్పటం వంటి కవిత్వ విన్యాసాలలో ఆరితేరినవాడు. కనుకనే “సారస్వతాలంకారు”నిగా, “నిరంకుశ ప్రతిభాబంధురు”నిగా, “ప్రబంధపఠన, రచనాదురంధరు”నిగా, “సకలభాషావిశేషనిరుపమావధాని”గా ఖ్యాతికెక్కాడు. కవిత్వానికిసంగీత మాధుర్యాన్ని అద్ది “సంగీత రహస్యకళానిధి”గా వెలుగొందాడు.

2. రచనానేపథ్యం:

వసుచరిత్ర కర్తగా తదనంతర కవుల పిల్ల వసుచరిత్రలకు మార్గదర్శకుడయ్యాడు. ఈ ప్రబంధంలో రెండవ ఆశ్వాసంలో శుక్తిమతి, కోలాహలులని నదీపర్వతాలుగా, స్త్రీపురుషులుగా తీర్చిదిద్దుతూ కవి చేసిన “శ్లేష చమత్కృతి” ప్రత్యేకం. తరువాత “హరిశ్చంద్రనలోపాఖ్యానం” అనే రెండర్థాల కావ్యరచన ద్వారా ఆసాంతం శ్లేషనిర్వహణకు పూనుకున్నాడు. ఈ ప్రయత్నం రామరాజ భూషణుని ప్రజ్ఞాపాటవాలకి నిదర్శనంగా నిలుస్తుంది. ద్వ్యర్థి కావ్యరచనలో రామరాజభూషణుని ముందు అటువంటి రచన చేసినవాడు పింగళి సూరన. పింగళి సూరన చెప్పిన శ్లేష విధాలలో ఒకటయిన “ఆంధ్రభాషా సంస్కృతాభిభాషాశ్లేష” రామరాజభూషణ కృతమైన “హరిశ్చంద్ర నలోపాఖ్యానం”లో ఏ విధంగా పరిఢవిల్లినదో ఇప్పుడు పరిశీలిద్దాం.

3. రచనాప్రణాళిక - షడ్విధశ్లేషలు:

ప్రతికవి తన రచనకు తగిన ప్రణాళికను ముందుగా సిద్ధం చేసుకుంటాడు. తనదైన ముద్రను కవితారీతుల ద్వారా వ్యక్తం చేస్తాడు. అయితే ఒక కవి వేసుకున్న ప్రణాళిక ఆధారంగా వేరొక కవి రచనను పరిశీలించటం సాధ్యమేనని ఇప్పుడు నిరూపించడానికి ప్రయత్నిస్తాను. హరిశ్చంద్ర నలోపాఖ్యానంలో "కథా ద్వయార్థ సంఘటన ప్రణాళిక పింగళి సూరన రాఘవపాండవీయమునందు ప్రకటించిన ప్రణాళికయే. ఆ ప్రణాళికలోని ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేష, శబ్ద శ్లేష, అర్థ శ్లేష, గౌణవృత్తి శ్లేష, అర్థాన్వయ శ్లేష, శబ్దాన్వయ శ్లేష మొదలైనవి హరిశ్చంద్రనలోపాఖ్యానమునందును కలవు" (తెలుగు సాహిత్య చరిత్ర (తృతీయ భాగం) - ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి, పు. 330.) అన్న శ్రీరామమూర్తి గారి మాటలు ఈ సందర్భంగా ప్రస్తావనీయం. శ్లేష నిర్వహణలో రాఘవపాండవీయం కర్త అయిన పింగళి సూరన ఒక నిర్ణీతమైన ప్రణాళికతో తన కావ్యరచనను ఆరంభించాడు.

సీ. “ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేష, యొక్కొక్క చోటనొక్కొక్క చోట
నుచిత శబ్దశ్లేష యొక్కొక్క చోట నర్థ శ్లేష యొక్కొక్క తఱిని ముఖ్య
గౌణవృత్తి శ్లేష ఘటన యొక్కొక్క తఱి నర్థాన్వయము వేఱె యగుచునునికి
శబ్దాన్వయ విభేద సంగతి యొక్కొక్క తఱినివి యొక్కొక్క తఱిని రెండు
తే. మూ(డు గూడుటయునన సముజ్జ్వలముగ
నాకు( దో (చిన గతి( బేకకు పోకల మర
రామభారత కథలు పర్యాయ దృష్టి(
జూచు సుమతుల కేర్పడ నాచరింతు

(తెలుగు సాహిత్యసమీక్ష (రెండవ సంపుటం). జి. నాగయ్య, పు. 181)

అని పింగళి సూరన తన రాఘవపాండవీయంలో చెప్పిన పై పద్యం ఆధారంగా ఆతని రచనా ప్రణాళికలో ప్రధానంగా ఆరు శ్లేషలు కనిపిస్తున్నాయి. అవి: 1. ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష, 2. శబ్దశ్లేష,  3. అర్థ శ్లేష, 4. ముఖ్యగౌణవృత్తిశ్లేష,  5. అర్థాన్వయ శ్లేష, 6. శబ్దాన్వయశ్లేష.
తాను వాడబోతున్న వివరాలతో పాటు సూరన పాఠకులకు నియమాన్ని విధించాడు.

"ఒక కథ వినియెడి తఱి వే
ఱొక కథపై దృష్టి యిడిన నొక యర్థము( దో (
పకపోవు(గాక నేకా
ర్థక కావ్యమెట్లట్ల విన( గ( దగునొకటొకటిన్"

(రా. పా.-డా. రేవూరు అనంతపద్మనాభరావు-పు. 8)

ద్వ్యర్థి కావ్యాలలో రెండు కథల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఒక కథను పూర్తి చేసిన తరువాత వేరొక కథాసారాన్ని గ్రహించాలి కానీ రెండు కథలను ఏకకాలంలో గ్రహించ తలచినచో ఏమీ అర్థంకాని స్థితి ఏర్పడుతుంది. అయితే రామరాజభూషణుడు రెండు కథలను ఒకేసారి గ్రహించాలని నిర్దేశించాడు. అదేవిధంగా కేవలం కథను గ్రహించటం అనునది కూడా ద్వ్యర్థి కావ్యవిషయమున సరిపోని విషయము. రెండు కథలను ఒకే సూత్రంతో నడిపించే విధానాన్ని ఏ విధంగా ఉన్నదో గమనించుట ముఖ్యము. ద్వర్థికావ్యములు ఒకరు చదువగా వేరొకరు విని రెండర్థములను స్ఫురింపచేసుకొని ఆస్వాదించునవికావు. ఎవరికీవారుగాచదివి కథాద్వయార్థాన్ని తెలుసుకోవలసినదే.

రాఘవపాండవీయము వలె హరిశ్చంద్రనలోపాఖ్యానము ద్వ్యర్థి కావ్యము. రామరాజ భూషణుడు దీనిని పింగళి సూరన కృతమగు రాఘవపాండవీయమునకు ప్రతిద్వందిగా రచించాడు. రామాయణ, భారత కథలందు దిగ్విజయము, వేట, మునిహత్య, శాపము, సంతాన యత్నము, వీర్యశుల్క వివాహము, వనవాసము, యుద్ధము మొదలగు సమాన కథాంశములు కొన్ని ఉన్నవి. కావున వాటిని ఏకకావ్యములో జోడించుట కొంత సులభకార్యము. కాని హరిశ్చంద్ర నల కథలలో అట్టి సమాన ఘట్టములు తక్కువ. కావున ఇందు శ్లేష నిర్వహణ క్లిష్టము. అయిననూ రామరాజభూషణుడు నేర్పుతో రెండర్థముల కావ్యమును నిర్మించినాడు.” (తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటం) – జి. నాగయ్య, పు. 181) అనే మాటలు రామరాజభూషణుని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి.

4. “హరిశ్చంద్ర నలోపాఖ్యానం”లో “ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేష:

ఆంధ్రభాషాసంస్కృతాభి భాషా శ్లేష రచనలో రామరాజభూషణుడు సభంగ, అభంగశ్లేషలను తెలివిగా ప్రయోగించాడు. సభంగ శ్లేష అనగా పదమును విరిచి శ్లేషార్థమును సాధించుట. అభంగమనగా పదమును విరువక శ్లేషార్థమును సాధించుట. ఈ అభంగమున శ్లేషార్థమును సాధించుటకు రామరాజభూషణుడు ఉభయ దేశ్య విశేష్యాలను విరివిగా, అక్కడక్కడా ఉభయ వైకృత విశేష్యాలను, ఉభయ దేశ్య సర్వనామములను, యుగళ దేశ్య అవ్యయాలను ఉపయోగించుకున్నాడు. ఆ విధంగా పరిశీలించినప్పుడు ఈ ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేషను మరలా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. అవి : 1. సభంగ ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేష,  2. అభంగ ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషాశ్లేష.

4.1 సభంగ ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేష:

క. క్షితి భర్త కుమారు(డు లో
హితుఁడన విలసిల్లె( జేర్చి హృదయంబున సం
తాతముదమునను జనాదర
మతి సాంద్రముగా బహుశ్రుతానందితుఁడై” (హ. న. 1-21, పు. 203)

పై పద్యమున హరిశ్చంద్ర కథలో లోహితుడు అని సంస్కృతార్థం, లో+హితుడు (లోపల ఆప్తుడన) అనుటచేతను లోపల అను తెలుగు పదముగా అర్థమును కవి కల్పించెను.

“సీ. మననీవు పాంథుల మదకలకంఠీర
వములు నానానాగాంతముల బలిసి
కలఁచు( బున్నాగంబు లలరు( గొమ్ముల మహో
న్నతిగలయన భీకమతులనైన
గమియు రసాలపుంజముల సారంగ సం
తాన సంతత శోభమానకిరులు
------------------------
------------------------
పొలపు( బత్తుల సురభి ప్రభుక్తి( గాంచి”.

(హ.న. 2-16, పు 225,226 )

పై పద్యమున "శోభమాన+ కిరులు" అను చెప్పుటచేతను పందులు అను అర్థమును తెలుపు సంస్కృత పదము కూర్పబడినది. శోభ+మానక+ ఇరులు అని విరిచి చెప్పుటచేతను చీకటి అను అర్థమును తెలుపు తెలుగుపదముగా మార్పునొందినది.

సీ. “వినుమాదరమున పవిత్ర సద్గోత్రయె
వ్వడు మనువంశ పావనుడనంగ
నడరు నెవ్వని కీర్తి యధరితామృత వార్థి
చంద్రమతీశుండు సాంద్రభూతి
శౌర్య వైశ్వానర జ్వాలావలీఢారి
నలుడతండలరు నా బలియు నందు
గలుగునా సత్య రేఖా గుణోత్కర్షమే
నరనాథునందు నెన్న(డును గాన
తే. మనుచుఁ దద్గురుసన్నిధి నభినుతింప
నాసమితి మీఱు చపుడదమానుభవమ
నోంబుజంబుననొనరి యత్యంత శక్తి
గాధితనయర్షి యతను(డాగ్రహము(బూని.” (హ. న. 1 – 25, పు. 205, 206)

పై పద్యంలో "ఆసమితిమీఱు" అను పదమును "ఆసన్ + మితిమీఱు" అని తెలుగులో మితిమీరిన ఆశ చేతను అను అర్థం కలుగుతుండగా, "ఆ + సమితి " అని విరుచుట చేతను సమితి అనగా సభ అను సంస్కృతార్ధం ఏర్పడినది.

సీ. ఉచిత క్రియలనాస్థ నొనరించి యెడపక
యో మహాభారవియోగభరస
మాగ్రనీరాకరమావలికడ సేర్ప(
గలరె నాసరివచ్చు ఘనులనన్య
జనబుద్ధి( జెంది తారని వేడ్క బహుతరా
గమశిఖా ప్రమితివిత్తముల నంచి
తనయ సద్భూతి బీమునినుదయోదార
మనసు వే(డెద నేన నియతి
తే. నరవరాన్వయ మణికొమ్మనవసుధాని
ధానమూర్తి నా సొమ్మిది... కాంతు
నా యభి మతార్థ మేనొక్కనాఁటి కింక
ననుచు నాత్మ మహాశ్రమం బధిగమించి”. (హ.న. 2-12, పు.222)

పై పద్యంలో "నీరాక +రమావలికడ" అని చెప్పినచో సంస్కృతార్థమున "సంపదలసమీపమున" అని అర్థం కాగా, "నీరాకారము+ ఆవలి కడ" అని చెప్పినచో "సముద్రము అవతల వైపునకు" అనగా "తరింపఁజేయుటకు" అను తెలుగు అర్థం వచ్చును.

ఉ. “మంగళ దేవతా ప్రభవ మందిర మంచుఁ దలంచి యంబకా
సంగతిఁ గూర్ప( డయ్యె వరుస న్వన కుంభిని సీధువాసనా
రాగము సారెసారె నలరాజశిఖామణి తత్పరిగ్రహా
భంగసముద్భటాళి రవభంగులకున్ మది సంభ్రమించుచున్” (హ.న. 2-26, పు.233)

పై పద్యమున "సారెసారెన్ +అల రాజశిఖామణి" అను విరుపులో అల రాజశిఖామణి అను శబ్దమునకు తెలుగున ఆ రాజశిఖామణి అని అర్థం కాగా, సారెసారె+ నలరాజశిఖామణి అను విరుపులో నలరాజు అను సంస్కృతార్థం కలిగినది.

క. “తలర కొకజాడ నవకం
  దళిత మహాబల సమృద్ధి( ధరియించుచు( బ
  ల్వల లక్ష్యోజ్జ్వల్యము( గను
పులినమ్ముల నించె లీల భూవరుడచటన్” (హ.న. 2-27, పు.234)

పై పద్యమున గల పులినమ్ముల అను పదమును "పులిన్+అమ్ముల" అని విరుచుట చేత తెలుగున "పులిని బాణాలతో నిండించాడ"ను అర్థంతో హరిశ్చంద్రుని పరంగా, సంస్కృతమున "పులినము" అనగా "ఇసుకతిన్నె" అను అర్థమును నలమహారాజు పరంగా కవి ప్రయోగించెను.

సీ. “అతి బహుల హరి సంతతులు పాలించు ను
త్కట తట మండనాగముల నెచట...” (హ.న. 2- 30, పు. 236)
పైపద్యంలో తెలుగున అర్థము తెలుపుటకు కవి "మండ+ నాగములు" అను విరుపును, సంస్కృతార్థమును సూచించుటకు "మండన+ఆగములను" అను విరుపును సాధించెను.

తే. కినిసి పాణినాళికంబు సొనుపుటయును
నంతలో( బడ కదియు మోహప్రకటన
మాని తన్ననిచిన యతి మానుతుంగ
తారు నెనసి తోనా గ్రహణ గోచరత( దొఱఁగె” (హ.న. 2-47, పు. 251)

పై పద్యంలో "మాని+తన్ను" అని తెలుగు విరుపును, “మానితన్+ ననిచిన” అని సంస్కృత విరుపును ప్రదర్శించాడు కవి.

తే. “మలఘుభూతి యగణ్య పుణ్య జనపాళి
కాసమసనంబ యోధ్యధైర్యా సమాన
మంత్రి కృత్యాస్పద మనూనమాన సాబ్జ
గుంభితాశ్చర్యు(డై కనుంగొనుచు వచ్చి”. (హ. న. 5 - 6, పు. 390)

పై పద్యంలో "జనపాళికి+ ఆస+మసనంబు" అని ఆచ్చికములును, "పుణ్యజనపాళికా+ సమసనంబు" అను సంస్కృత పదముగా విరుపును కవి చూపెను.

4.2 అభంగ ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేష:

తే. “అతని సౌందర్య వర్ణనోద్యత జనాళి
నిత్య పరిపూర్ణకాంతి నిర్ణిద్ర చంద్ర
మతి ముదిత యై భజించు( దన్మాన సాను
రరోప సముచిత సేవా నిరూఢీ మెఱయ” (హ. న. 1-19, పు. 202) అను ఈ పద్యంలో “ముదిత” పదం చంద్రమతి పరంగా అచ్చతెలుగు అర్థంలో “స్త్రీ” గా, దమయంతిపరంగా సంస్కృత అర్థంలో “సంతోషమొందినది’’ అనే విశేషణంగా కనిపిస్తుంది. అదే విధంగా

సీ. వినుమాదరమున పవిత్ర సద్గోత్రయె
వ్వడు మనువంశ పావనుడనంగ
నడరు నెవ్వని కీర్తి యధరితామృత వార్థి
చంద్రమతీశుండు సాంద్రభూతి
శౌర్య వైశ్వానర జ్వాలావలీఢారి
నలుడతండలరు నా బలియు నందు
గలుగునా సత్య రేఖా గుణోత్కర్షమే
నరనాథునందు నెన్న(డును గాన…….” (హ. న. 1 – 25, పు. 205, 206)

అను దానిలో “మనువంశపావనుడ”నే సంస్కృతార్థం హరిశ్చంద్రునికి, “జీవించుట” అనే తెలుగు అర్థం నలునికి వర్తించేలా ప్రయోగించాడు కవి.

సీ. “గంతులు దక్కింతు మెంతయు(గదియు ఘో
రారావ పరవీర హరుల నైన
మదమడంతుము పోటుయగ(టిమి నెఱపుభీ
కర లోలకర వాలా కరుల నైన
నలమీ గీ వెట్టింతు యలుక( గోఱలు నూఱి
పై వచ్చు భూధారపతుల నైన(
జన్మమెత్తుదుము రోసమున మీసములు దీం
డ్రించు ధీర చమూరురిపుల నైన………” (హ. న. 2 – 19, పు. 229)

అనే పద్యంలో "వాల" శబ్దాన్ని హరిశ్చంద్రకథలో "తోక" గా, నలుని కథలో “కత్తి” అనే అర్థం వచ్చేలా ప్రయోగించాడు కవి.

సీ. హితమాచరించె నీయతి ధన్యు(డనుచు నా
హంసాన్వయాగ్రణి యచటనచటఁ
.............................................
తే. గలుగఁ జేసితివైన సత్కులజ నీకు
మార గురు దేహ సుషమా సమష్ఠికి దమ
యంతి యనఁదగు శుభకీర్తికాంత దొరయ(
జేయు దేవర రాజ్యంబు సిరి ఫలింప”. (హ. న. 2- 38, పు. 244)

పై పద్యమున "చేసితివి+ ఐన సత్కులజ" అనుటలో ఐన శబ్దానికి ఇన(సూర్య) సంబంధమైన అని అర్థం వచ్చేటట్లుగా సంస్కృతమున, "అయినా" అనే అవ్యయమును తెలుగు అర్థానికి కవి అలదిన తీరు అద్భుతమనిపిస్తుంది.

సీ. కురువిందముల చంద మిరవంద( గల యంద
ములమించు మొగమున( దళుకులోలుకఁ
బాగాదాలు దగా డీలుపడ( గ్రాలుజగడాలు
గలయంఘ్రలు మెఱుంగుగములనీన(
గణకంపురుచి వెంపు( గడనుంపు బలితంపు(
బక్ష కాంతి వంటా పదవి( బొదువ
ఘనహీరమణివార మనువారము నవార
ణ జయించునేని విన్నాణ మమర(
తే. దన్నారు మానసప్రియము చిత్రద్యుతులకు
రంగముం దపోజ్వలిత సారస హీతార్చి
కౌశిక సమాఖ్యు(డు నయము గా శయమున
నెంతయు నొనర్చి లాలించి ఇట్లు పలికె” (హ. న. 2 – 40, పు. 246)

పై పద్యమునందు "నయము" అనే పదం హరిశ్చంద్రలో "నీతిని విడిచిన" అనే అర్థంలో వాడగా, నలుని కథలో "మృదుత్వం" అనే అర్థంలో వాడాడు కవి. అదే విధంగా "మనము" అనే పదాన్ని సంస్కృతార్థంలో, అచ్చ తెనుగు అర్థంలో కవి ఎంత చక్కగా కూర్చాడో ఈ కింది పద్యం ద్వారా తెలుస్తుంది.

“చ. జనవినుత ప్రభాకలిత చంద్రమతీ! తల(బట్టి మోహముల్
పెన(గొన( జేసి పాదహతి బెట్టు మెయిన్ ద్విజరాజు రేసికై
కోన నిఖిల క్షమాభారము క్రూర విషాద పయోధి(గ్రుంక( గం
టిని గలయంగ నా మనము నెవ్వఁగఁ బాయఁగఁ జేయు మీవనన్
(హ. న. 2 – 54, పు. 256, 257)

విషాద సముద్రంలో మనమందరం మునిగినట్లు కల కంటిని అని హరిశ్చంద్రుడు చెపుతుండగా, చంద్రకిరనరాల వేడి తన మనసుని చింతకు గురి చేసినదని నలుడు చెప్పినట్లుగా ప్రయోగించడంలో కవి నేర్పు తెలుస్తుంది. ఇక మరియొక ఆంధ్రభాషా సంస్కృతాభి భాషా శ్లేషకు ఉదాహరణగా నిలిచే "నారి" పదాన్ని రామరాజభూషణుడు ఎంత గొప్పగా ప్రయోగించాడో ఈ కింది పద్యాన్ని గమనిస్తే తెలుస్తుంది.

తే. వెలయఁ గామలోద్భవుని నారి వే(డి నీల
కంఠసతి వేడి(యు ననూన గానలాస్య
మాధురీ విభ్రమంబులు మట్టు పఱుప
నొందిరి రతి వలితాత్మజాత్యుచ్ఛ్రయమున” (హ. న. 2 – 62, పు. 263)
కమలోద్భవుని ‘నారి’ అంటే స్త్రీ అనగా బ్రహ్మ భార్య సరస్వతిని హరిశ్చంద్ర కథలో, మన్మథుని వింటి ‘నారి’ అనగా అల్లెతాడు గా నలుని కథకి అమోఘంగా ఆపాదించాడు.

సీ. “అటు నిల్వ నాశిఖ హంసాసమాంబక
హరిముఖాధికా దీప్తి నడరు వాని
నరసియేతద్ద్వి జాతర సాతిశయ నేవ
నమూనా నిల్పుడు జీవనంబులని వి
భుండు దండమొనర్ప( బూని ఏకోకపా
టునకు లో(బడ( జేయ మునుకొని యవి
కలిత కోపమున( దత్కౌశేయము గ్రహించి
యతిరభసమున మిన్నంది పలికె……….”( హ. న. 3 – 23, పు. 317)

హరిశ్చంద్రుడు దండమొనర్చెనని (నమస్కరించెనని),నలుడు పక్షుల మాంసం తినటానికి దండమొనర్చెనని (చంపుటకు సిద్ధపడెనని) ఎటువంటి విరుపులు తావు లేకుండా చక్కని శ్లేషను కూర్చాడు కవి. ఈ ఆంధ్ర భాషా సంస్కృతాభి భాషా శ్లేషలో కూడా ఎన్నో వైవిధ్యాలను చూపించాడు రామరాజభూషణుడు.

తే. కాన శంబర మధనా స్త్రీ కలిత లీలఁ
దన్నారు తద్రాజముఖ్య వతంసమునకు
మనసు తమిరే(చి మన్మహావనము( గలయ(
జేయు మని పంపానదియును( జేరఁ బోయి” (హ. న. 2 – 42, పు. 247,248)

“కాన” శబ్దం అచ్చ తెనుగులో ‘కనుక’ అని, ‘అడవి’ అనే అర్థంలో వైకృతంలో ప్రయోగితమైనది.
ఒక అర్థములో అచ్చ తెనుగు, ఒక అర్థములో వైకృతమును అగు పదాలయిన ఉభయ వైకృత విశేష్యాలను రామరాజభూషణుడు ఈ ద్వ్యర్థి కావ్యంలో నిక్షిప్తం చేసాడు.

5. ముగింపు:

"మామూలు ఏకార్థ కావ్యాలలోనే రెండేసి అర్థాలు వచ్చే పద్యాలు వ్రాసేవాడు రెండర్థాల కావ్యాలలో ఇంకా విజృంభించడా..?"(సమగ్రాంధ్ర సాహిత్యం(రెండవ సంపుటం) – ఆరుద్ర, పు.335) అన్న ఆరుద్ర మాటలు అక్షర సత్యాలు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

రామరాజభూషణుడు సిద్ధం చేసుకున్న శ్లేష ప్రణాళిక ద్వారా ఆతని మహాత్మ్యం గ్రహించగలిగినదే అయినా పింగళిసూరన ప్రణాళికను కూడా ఆపాదించి చూసినప్పుడు మరిన్ని సొగసులతో కూడిన శ్లేష చమత్కృతులు మన కళ్ళకు కడతాయి. సూరన చెప్పిన ఆరు విధాల శ్లేషలలో ఈ పరిశోధనాపత్రం కేవలం ఒక శ్లేషను మాత్రమే అన్వయించి చూసి, నూతన సౌందర్యమును అందించినది. అటువంటప్పుడు మిగిలిన అయిదు శ్లేషలను, రామరాజభూషణుడు చెప్పిన ప్రకృత, అప్రకృత, ప్రాకృతాప్రాకృతాలతో కలిపి అభంగ, సభంగాలుగా పరిశీలించగలిగినప్పుడు హరిశ్చంద్రనలోపాఖ్యానంలో మరిన్ని సొగసులు ఆస్వాదించగలమని చెప్పడం అతిశయోక్తి కాదు.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అనంతపద్మనాభరావు, రేవూరు. (2018). రాఘవపాండవీయం, అక్షయ గ్రాఫిక్స్: హైదరాబాద్.
  2. ఆరుద్ర, (2012). సమగ్రాంధ్రసాహిత్యం (4వ ముద్రణ), రెండవ సంపుటం, తెలుగు అకాడమీ: హైదరాబాద్.
  3. చినసీతారామస్వామిశాస్త్రి, వజ్ఝల. (1930). హరిశ్చంద్రనలోపాఖ్యాన విమర్శనము, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్: మద్రాస్.
  4. నాగయ్య. జి, (2009). తెలుగు సాహిత్యసమీక్ష (6వ ముద్రణ), సి. ఎన్. ప్రింటర్స్: తిరుపతి.
  5. శ్రీరామమూర్తి, కొర్లపాటి. (1994). తెలుగు సాహిత్య చరిత్ర, రమణశ్రీ ప్రచురణ: విశాఖపట్టణము.
  6. సీతారామాచార్యులు, బహుజనపల్లి. (2008). శబ్దరత్నాకరం(4వ ముద్రణ), విక్టరీ పబ్లిషర్స్: విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]