headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-4 | April 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

14. "ఆంధ్ర పద్యకవితాసదస్సు" అంతర్జాల సాహిత్యోపన్యాసాలు: నిర్వహణ సవాళ్ళు, సౌకర్యాలు

డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ

తెలుగు సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ, మానవీయశాస్త్రవిభాగం,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం,
శ్రీసత్యసాయి జిల్లా –515134, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9247859580, Email: psarmarambhatla@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగుసాహిత్యంలో పద్యవిద్యకున్న స్థానం ఎంతో ఉన్నతమైంది. ప్రాచీనసాహిత్యమంతా పద్యాత్మకంగా సాగి, మానవజీవనసరళికి అనునిత్యం ఉపయోగించే విలువల సమాహారంగా భాసిస్తూ ఉంటుంది. అలాంటి పద్యవిద్యను, పద్యకావ్యాలను, పద్యకవులను ప్రోత్సహించడానికి విశాఖపట్నంలో ఆవిర్భవించిన మహోన్నత సంస్థ ఆంధ్రపద్యకవితాసదస్సు. వారానికొక సదస్సు నిర్వహిస్తు, వక్తలు ప్రసంగించే విశేషమైన అంశాలద్వారా, స్వీయపద్యపఠనాలను ప్రోత్సహిస్తూ, పద్యరచనశిక్షణాశిబిరాలను నిర్వహిస్తూ ఈ సంస్థ అంచెలంచెలుగా ఆంధ్ర-పద్యప్రియులకు చేరువైంది. రాష్ట్రవిభజనతో తెలంగాణాలోనూ అనుబంధసంస్థలు ఏర్పచుకొని కొనసాగు-తోంది. కరోనా మహమ్మారి ప్రబలి, వేదికలపై కార్యక్రమాలు నిర్వహించడం కుదరని పరిస్థితుల్లో, అంతర్జాలంలో సాహిత్యసమావేశాలు నిర్వహించిన కొన్ని సంస్థల్లో అంతర్జాతీయంగా, జాతీయస్థాయిలోనూ చెప్పుకోదగ్గ సంస్థ ఆంధ్రపద్యకవితాసదస్సు. 2021 అక్టోబరు నుండి కొన్ని నెలల పాటు ప్రతి ఆదివారం ఈ సంస్థ జూమ్/గూగుల్ మీట్ వంటి సాధనాలద్వారా, యూట్యూబ్ వంటి ఉపకరణాల ద్వారా ఈ సదస్సు నిర్వహించి, ప్రేక్షకులకు పంచి తెలుగు భాషాసాహిత్యాల పరిరక్షణకు ఎంతో తోడ్పడింది. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న ఈ సంస్థ కార్యక్రమాలను సునిశితంగా విశ్లేషించి, కార్యక్రమాలు, వక్తలు, ప్రత్యేకతలను వివరణాత్మక పద్ధతిలో తెలియజేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం. అంతర్జాల వనరులు ఈ సంస్థ సభ్యులు అందించిన వివరాలు ఈ పరిశోధన వ్యాసానికి ప్రధానాకరాలు.

Keywords: పద్యం, సాహిత్యం, ప్రసంగం, పుస్తకావిష్కరణ, సమీక్ష, ఉపన్యాసం, అంతర్జాలసాహిత్యం, జూమ్, గూగుల్మీట్, అనకాపల్లి

1. ఆంధ్రపద్యకవితాసదస్సు ఆవిర్భావం:

ఆంధ్రపద్యకవితాసదస్సు 1992లో ఎలమంచిలి కేంద్రంగా ఏర్పడింది. శిష్ట్లా వెంకటరావు (కమర్షియల్ టాక్స్ ఆఫీసర్) అభిరుచి మేరకు ఈ సంస్థ ఆవిర్భవించింది. విశాఖపట్నంలోని మహాకవి, సంప్రదాయవాది శ్రీ కొండేపూడి సుబ్బారావు అధ్యక్షుడిగా, వెంకట్రావు కార్యదర్శిగా ఈ సంస్థను రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు. ఉభయ-గోదావరి జిల్లాల్లో, ప్రకాశంజిల్లా... ఇలా అన్ని జిల్లాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేశారు. ఆంధ్రరాష్ట్రంతో పాటు తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడ కూడా జిల్లా శాఖలు ఏర్పాటు చేశారు. కరీంనగర్, నల్గొండల్లో కొన్ని శాఖలు చాలా క్రియాశీలంగా ఉండేవి.

 2. కార్యక్రమాల రూపకల్పన- నిర్వహణ:

“మొట్టమొదట ఇది రాష్ట్ర కమిటీ కాబట్టి విశాఖపట్నం జిల్లాలో ఎలమంచిలిలోనే అధ్యక్షులు, సభ్యులే ఎవరైన నెలకొకసారి, రెన్నెళ్ళ కొకసారి ఉపన్యాసాలు చెప్పేవారు. తర్వాత సదస్సు నిర్వహణలో రాజమండ్రిలో భువనవిజయం ప్రదర్శించారు. బేతవోలు, గరికపాటి, కోట లక్ష్మీనరసింహకవి, కేసాప్రగడ మొదలైనవారు, అవధానులెందరో దీనిలో పాత్రధారులు. ఆ సభలోనే, అప్పుడే "సాహితీకౌముది" అనే సాహిత్యపత్రికను ప్రారంభించారు. కేవలం పద్యకవిత్వంతో, సమీక్షలతో, సమస్యాపూరణలతో నడిచే పత్రిక ఇది. దానికి సంపాదకుడిగా శిష్ట్లా వెంకటరావు మొదట్లో ఉండేవారు. తర్వాత ఆశావాది ప్రకాశరావు మొదలైన వారున్నారు.

ఈ శాఖలో అధ్యక్ష, కార్యదర్శులు ప్రసంగిస్తూ ఉండేవారు. మాటూరు హైస్కూల్లో పనిచేస్తూన్న మెరుగుమిల్లి వెంకటేశ్వర్లు అక్కడే "శ్రీవాణి సాహితీ సమితి" స్థాపించి ఒక వందమంది సభ్యులను చేర్చి, నిర్వహిస్తూండే వారు. వెంకటరావు పిలుపు మేరకు ఆంధ్రపద్యకవితాసదస్సులో సభ్యులుగా చేరారు. కొండేపూడి వెంకట సుబ్బారావు తర్వాత ఈ సంస్థకు నండూరి కృష్ణమాచార్యులు అధ్యక్షులయ్యారు. ఆయన కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, విశాఖ జిల్లా కూడా వచ్చి, అప్పుడప్పుడు కవిసమ్మేళనాలు నిర్వహించేవారు. ఆ తర్వాత  ఆశావాది మొదలైన వారు వరుసగా రాష్ట్రస్థాయి అధ్యక్షులుగా ఉన్నారు. విశాఖ జిల్లాశాఖకు అధ్యక్షులుగా కొన్నాళ్ళు బులుసు వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా కె. కోటారావు ఉన్నప్పటికీ అనతి కాలంలోనే కోటారావు అధ్యక్షులయ్యారు. మెరుగిమిల్లి వెంకటేశ్వర్లు కార్యదర్శి అయ్యారు.

రెండు, మూడు మాసాలకొకసారి జరిగే కార్యక్రమాలు నెలవారీగా మారి,  ప్రతినెల రెండో ఆదివారం జరుగుతూ ఉండేవి. ప్రాచీన-ఆధునిక పద్యకవిత్వంపై ప్రసంగాలు, సమీక్షలు, పుస్తకావిష్కరణలు, కవిసమ్మేళనాలు, అష్టావధానాలు, భువనవిజయాలు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ "సదస్సు" భాషాసాహిత్యాలసేవకు ప్రయత్నం చేస్తూ వచ్చింది. భువనవిజయం ప్రదర్శించడానికే ఒక టీం తయారు చేసుకొని అన్ని చోట్ల ప్రదర్శిస్తూ, ఆ ప్రదర్శనలపై వచ్చే డబ్బును ఆంధ్రపద్యకవితా సదస్సు నిర్వహణకు వెచ్చించడం, చందాలు పోగుచేసి సంస్థ నిర్వహణకు ఖర్చుపెట్టడం జరుగుతూండేది. ఆంధ్రపద్యకవితాసదస్సు రెండేళ్లకొకసారి వార్షికసదస్సు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. తుని, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి మొదలైన ప్రాంతాల్లో వార్షికసభలు జరిగాయి. ప్రస్తుతం కె. కోటారావు రాష్ట్ర అధ్యక్షులుగా, బులుసు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా, గురుసహస్రావధాని కడిమిళ్ల వరప్రసాదకవి కార్యదర్శిగా ఉన్నారు. విశాఖజిల్లా అధ్యక్షులుగా మెరుగుమిల్లి వ్యవహరిస్తున్నారు. కరోనా ముందు వరకు వేదిక మీద సభలు బాగా నడిచాయి. కరోనా కాలంలో ఈ సభల్ని ఆన్లైన్లో నిర్వహించడం మొదలు పెట్టారు. (జిల్లా అధ్యక్షులతో ముఖాముఖి, 01.02.2023)

౩. అంతర్జాలవేదికపై ఆంధ్రపద్యకవితాసదస్సు కార్యక్రమాలు:

అక్టోబర్ 2021 నుండి ఆన్లైన్ ద్వారా కార్యక్రమాల నిర్వహణకు సదస్సు పూనుకుంది. ఇందుకోసం వర్చువల్ వీడియో కాన్ఫరెన్సింగ్ వేదికలైన జూమ్/గూగుల్ మీట్ వంటి సాధనాలను ఈ సంస్థ ఆశ్రయించింది. స్వచ్ఛందంగా కొందరి సాంకేతికనిర్వహణ సహకారం మేరకు, పరిమితమైన నిధులతో అంతర్జాలనిర్వహణ ఖర్చులతో ప్రతీ ఆదివారం ఈ అంతర్జాల సదస్సులు నిర్వహించారు. నిర్వాహకులు, వక్తలు, ప్రేక్షకులు వేరువేరు ప్రాంతాల నుండి ఈసదస్సులో పాల్గొనేవారు. ఆంధ్రదేశంలో సుప్రసిద్ధులైన సాహితీవేత్తలు, కవులు, అవధానులు, వక్తలెందరో ఈ సదస్సుల్లో ప్రసంగించారు. పరిస్థితులు చక్కబడేంతవరకు దాదాపు 2022 మే నెలవరకు ఈ కార్యక్రమాలు అంతర్జాలంలోనే సాగాయి. ఈ సదస్సు అంతర్జాలకార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించిన కొత్తలో వేరు వేరు సంస్థల జూమ్, గూగుల్ మీట్ ఖాతాల ద్వారా ప్రయోగాత్మకంగా ఒకటి రెండు కార్యక్రమాలను నిర్వహించింది. సదస్సు నిర్వాహకులు, సభ్యులు, ప్రేక్షకులు, వక్తలు ఈ అంతర్జాలమాధ్యమాలకు, కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ల పై హాజరుకావడానికి అలవాటు పడిన తరువాత ఈ సంస్థే సొంతంగా పూర్తిస్థాయి గూగుల్ వర్క్స్పేస్ ఖాతాను కొనుగోలు చేసి చక్కని సాంకేతికసహకారాన్ని అందించే సభ్యుల, ఉదారుల సహకారంతో కార్యక్రమాలను నిర్వహించసాగింది. 

4. సదస్సు అంతర్జాలకార్యక్రమాలు- వర్గీకరణ:

ఆంధ్రపద్యకవితాసదస్సు అధికారిక యూట్యూబ్ ఛానల్లో, మరియు ఒకటి రెండు ఇతర ఛానళ్ళలో అందుబాటులో ఉన్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తే, 2021 అక్టోబర్ నుండి 2022 మే నెలల మధ్య ఈ సదస్సు నిర్వహించిన కార్యక్రమాలను ఐదు భాగాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1. పుస్తకావిష్కరణలు, 2. ప్రాచీనపద్య-కవితాసంబంధులు, 3. ఆధునిక పద్యకవితాసంబంధులు, 4. కావ్యగానసభ, 5. కవిసమ్మేళనాలు.

 4.1 పుస్తకావిష్కరణలు:

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సదస్సు అంతర్జాలంలో రెండు పుస్తకావిష్కరణ సభలను నిర్వహించింది. 1. శ్రీపతిశతకం, 2. శ్రీరామపాదుకాపట్టాభిషేకము. శ్రీపతిశతకం ‘నవభారతరత్న’ పురస్కారగ్రహీత డా. అద్దంకి శ్రీనివాస్ రచన. అక్టోబర్ 15, 2021న జూమ్ మాధ్యమం వేదికగా ఈ సభ జరిగింది. పార్లమెంట్ సభ్యులు కె.వి. సత్యవతి, ప్రముఖవైద్యులు డా. కె విష్ణుమూర్తి ఆవిష్కరించారు. మండలి బుద్ధప్రసాద్, ముక్తేశ్వరరావు-ఐఏఎస్, వెంపటి కుటుంబశాస్త్రి వంటి మహోదయలు ఈ సమావేశంలో ప్రసంగించారు. లఘువ్యాఖ్యాన సహితమైన ఈ శతకం- రసభరితం, ఆపాతమధురం, స్తుతిమంతం, మోక్షమార్గనిర్దిష్టం, వ్యంగాస్త్ర, సామాజిక సందేశాత్మకంగా రూపుదిద్దుకుందని అతిథులు కొనియాడారు.

శ్రీరామపాదుకాపట్టాభిషేక కావ్యం ముగ్గురు యువశతావధానులు యువశతావధాని త్రితయంగా డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, చి. తాతా సందీప్ శర్మ, చి. గన్నవరం లలిత ఆదిత్య, ఆశువుగా అంతర్జాలంలోనే చెప్పిన లఘుపద్యకావ్యం. సద్యఃకావ్యనిర్మాణ సంక్రీడాత్మక "శ్రీరామ పాదుకాపట్టాభిషేకము" ఆవిష్కరణ మహోత్సవం ఏప్రిల్ 15, 2022న ఈసభ జూమ్ వేదికపై జరిగింది. డా. మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు (అనకాపల్లి), సభాధ్యక్షులు. శ్రీమతి డా. ధూళిపాళ అన్నపూర్ణమ్మ (రాజమహేంద్రవరం), గ్రంథావిష్కరణ చేసారు. అవధానప్రాచార్యులు ధూళిపాళమహాదేవమణికి వారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రంథకర్తలు ఈ కృతిని అంకితమిచ్చారు. సమీక్షకులుగా "మధురభారతి" డా. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి (విజయవాడ) ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని, కావ్యంలో సొగసుల్ని విశేషంగా వ్యాఖ్యానించారు. వాల్మీకి రామాయణం ప్రాతిపదికగా వెలుగుచూసిన ఈ కావ్యంలో వర్ణనలు, అలంకారాలు, పదసౌష్టవం, మృదూహలు, చమత్కారాలు, ఛందోవిన్యాసం వంటివి ఈ కవుల ప్రతిభకు తార్కాణమని, చక్కని మెరుపులని వక్తలు, అతిథులు కొనియాడారు. డా. దోనెపూడి నరేశ్, (కర్నూలు) వందన సమర్పణతో ఈ కావ్యావిష్కరణ సభ విజయవంతమైంది.

4.2 ప్రాచీనపద్యకవితాసంబంధులు:

ఆంధ్రపద్యకవితాసదస్సు జూమ్/గూగుల్ మీట్ వేదికపై నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో కొన్ని ఇతిహాస, కావ్య, ప్రబంధాలకు సంబంధించిన పద్యకవితావిమర్శనం కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం రీత్యా ఈ సదస్సు అంతర్జాల సమావేశాలలో అనేక తెలుగు ప్రాచీనకావ్యప్రబంధాలను వక్తలు సమీక్షించడం, వ్యాఖ్యానించడం, విశ్లేషించడం, సమన్వయించడాలను గమనించవచ్చు. ఆయా కార్యక్రమాలలో ప్రసంగాశాలవారీగా చూస్తే- ప్రబంధ చమత్కారాలు-1, శ్రీకాళహస్తి మాహాత్మ్యం – జనజీవనం, శ్రీనాథుని భక్తి - పోతన రక్తి, ప్రహ్లాదచరిత్రము, హరవిలాస గౌరీకళ్యాణం, వసుచరిత్ర - శ్లేష వైభవం, ముకుందమాల - భక్తి తత్త్వం, భాస్కరరామాయణం - సీత మండోదరి, తెలుగు, కన్నడ భారతాలలో– విరాటపర్వం, దక్షిణాంధ్రయుగం– పద్యవైచిత్రి, శ్రీకృష్ణ నిర్యాణం– పాండవనిర్వేదం, శ్రీనాథుని చాటువులు, ధూర్జటి– పద్యమాధురీమహిమ, వామనచరిత్ర, పెద్దన కవిత్వం– శిరీషకుసుమపేశలం, ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు, ఆముక్తమాల్యద - అనన్యకృతి ప్రబంధము, పోతనకవి గజేంద్రమోక్షణము మొదలైన విజ్ఞానదాయకమైన, రసానందాన్ని కలిగించే వైవిధ్యభరితమైన ప్రసంగాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది

4.3 ఆధునిక పద్యకవితాసంబంధులు:

ప్రాచీనపద్యకవిత్వాంశాలతోనే కాకుండా అదే స్థాయిలో ఈ సదస్సు ఆధునికపద్యకవితాసంబంధులైన ప్రసంగాలను, సమీక్షలను ఏర్పాటు చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఉదాహరణకు ఇటువంటి ప్రసంగాంశాలను చూద్దాం.  నీలపెళ్ళి- అచ్చ తెలుగు వెలుగు, అక్షరమోహనాస్త్రం - నీల మోహనం, శతకవైభవం, కాళ్ళకూరి నారాయణరావు– నాటకత్రయం, శ్రీ మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రివిరచిత మృత్యుంజయశతకసౌందర్యం, గుఱ్ఱం జాషువా-స్మృతికవిత్వం, వేటూరి ప్రభాకరశాస్త్రి-వాఙ్మయ-వరివస్య, అచ్చతెలుగు అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాదు– సారస్వతవైభవం, శ్రీపతిశతకం- దశావతారవర్ణనలు, విశ్వనాథ భావుకత మొదలైనవి ఈ సదస్సు అంతర్జాలసమావేశాలలో ప్రతి ఆదివారం లబ్ధప్రతిష్టులైన వక్తలు ప్రసంగించిన విషయాలుగా తెలుస్తోంది.

4.4 కావ్యగానసభ:

కావ్యగానసభ అన్నదే అంశంగా ఈ సదస్సు అంతర్జాలంలో ఒక సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య, విశిష్ట అతిథులుగా ఎల్.వి. సుబ్రహ్మణ్యం, ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధపద్యాలకు, ఘట్టాలకు అర్థాలను బోధించే ‘కావ్యపాఠం’ వంటి విశిష్టసాహిత్యకృషిని చేస్తున్న డా. అద్దంకి శ్రీనివాస్ దగ్గర పద్య-గద్యాలను ధారణ చేస్తూ వారి శిష్యవర్గం నేర్చుకున్న అంశాలను సభాముఖంగా ప్రదర్శించడం, గానం చేయడమే ధ్యేయంగా ఒక విశేషకార్యక్రమాన్ని “కావ్యగానసభ” అన్న పేరుతో ఈ సదస్సు 2022- మే 15న నిర్వహించింది. ఈ సమావేశంలో డా. అద్దంకి వారి సారథ్యంలో విద్యార్థులనుండీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లవరకు వివిధరంగాలకు చెందిన శిష్యబృందం – ప్రసిద్ధమైన పద్యగద్యాలను గానంచేసి వినిపించారు. దాదాపు ఇరవైనిమిషాలపాటు సాగిన ఈ కావ్యగానం తరువాత అతిథులు వారి వారి అభిప్రాయాలను, అభినందనలను తెలియజేశారు.

4.5 కవిసమ్మేళనాలు:

పద్యకవులను ప్రోత్సహించాలని, పద్యకవిత్వాన్ని పరిరక్షించాలనే ఉన్నతాశయంతో ఆంధ్రపద్యకవితాసదస్సు ప్రతి సమావేశంలో 45 నిముషాల ప్రధానవక్త ప్రసంగం తరువాత చివరి 20 నిముషాల సమయంలో సందర్భశుద్ధితో ఆ వారానికిగానూ ముందుగానే నిర్దేశించిన ఒక అంశంపై పద్యకవితాగోష్ఠులను నిర్వహిస్తూ ఉంటుంది. ప్రఖ్యాతుల, వక్తల, సభ్యుల స్వీయపద్యకవితాపఠనంతోపాటు ఔత్సాహికులు, పద్యవిద్యాభ్యాసకులు ఈ సదస్సు సమావేశాల్లో ప్రతివారం ప్రసంగాంతంలో కొన్ని స్వీయపద్యాలను చదివి వినిపించడం ఈ సదస్సు సంప్రదాయం. ఆ విధంగా అంతర్జాలసమావేశాలలో కూడా ప్రధానోపన్యాసం పూర్తయిన తరువాత కొందరు సభ్యులు పూర్వనిర్దేశిత అంశం మీద స్వీయపద్యాలను చదివి సమావేశాన్ని రక్తికట్టించేవారు. అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా కొన్ని అంశాలు: దీపావళి, శరదృతువు, అమ్మబాస-కమ్మదనం, వరదలు, దేవాలయం, నూతనసంవత్సరం మొదలైనవి.

5. నిర్వహణ సవాళ్ళు, సౌకర్యాలు:

ప్రారంభంలో అంతర్జాలంలో సాహిత్యసమావేశాల నిర్వహణ ఎంతో క్లిష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే దాతలు, నిర్వాహకులు, వక్తలు, ప్రేక్షకులు ఉంటే సామాన్యవేదికలమీద నడిచే సదస్సులు, అంతర్జాలంలో సవ్యంగా సాగాలంటే కొన్ని పరిమితులు, నియమాలు, నిర్వహణలో సవాళ్ళు ఉంటాయి. వాటిలో ప్రధానంగా సమావేశం నిరంతరాయంగా సాగేందుకు నిర్వాహకులకు తగిన సామర్థ్యమున్న కంప్యూటర్లు, ఇంటర్నెట్, కరెంట్, బాకప్ సదుపాయాలు ఉండాలి. సరైన వీడియో కాన్ఫెరెన్సింగ్ వేదికను ఎన్నుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించే విధానాన్ని క్షుణ్ణంగా నిర్వాహకులు, పరిమితంగా వక్తలు, ప్రేక్షకులు తెలుసుకోవాలి. వీటిలో కొన్ని ఉచితంగా లభిస్తుంటే, అవసరాన్ని బట్టి ప్రత్యేకమైన ఫీచర్లన్న సాఫ్ట్వేర్ వెర్షన్లను కొన్ని కొనుగోలు చేసి వాడాల్సి ఉంటుంది. వీటన్నిటినీ సమన్వయం చేస్తూ సమావేశనిర్వహణకు ఉపయోగపడేలా పర్యవేక్షించే సాంకేతికనిపుణుల సహకారం ఉండాలి. సమావేశాలలో చేరిన వారే కాక, ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు లైవ్ స్ట్రీమింగ్లు చెయ్యడానికి, రికార్డింగ్ చేసి భద్రపరిచడానికి వెసులుబాటు ఉండాలి. పరికరాలు, ఇంటర్నెట్ల వ్యత్యాసం వల్ల - మాట, దృశ్యాలలో స్పష్టత లోపించవచ్చు. అనివార్యకారణాలవల్ల వక్తలు, నిర్వాహకులు, ప్రేక్షకులు సమావేశంలో చేరలేకపోవచ్చు.

ఇక ఈ అంతర్జాలసమావేశాలు నిర్వహించడంలో వేదికలపై నిర్వహించే సదస్సులతో పోల్చిచూస్తే కొన్ని అధికప్రయోజనాలు ఉన్నాయని గమనించవచ్చు. తక్కువఖర్చుతో సమావేశం నిర్వహించవచ్చు. ప్రత్యేకమైన వేదికలను కేటాంచవలసిన అవసరం లేదు. ప్రయాణభారం తగ్గుతుంది. ఎక్కువసంఖ్యలో ప్రేక్షకులు పాల్గొనగలరు. ఒక ప్రాంతం వారేకాక, అంతర్జాతీయంగా వీక్షించే వీలుంటుంది. రికార్డ్, లైవ్ స్ట్రీమింగుల వల్ల సమావేశం అంతర్జాలంలో శాశ్వతంగా ఉంటుంది. ఈ సంస్థ అంతర్జాలసమావేశాలు కొన్ని రికార్డింగ్ గాని, యూట్యూబ్ ప్రసారం చెయ్యనివి ఉన్నాయి. డిశంబర్-జనవరి నెలల్లో కొన్ని వారాలలో కారణాంతరాలవల్ల ఈ సమావేశాలను రద్దుచేసినట్లు గమనించవచ్చు.

ఆంధ్రపద్యకవితాసదస్సు నిర్వహించిన అన్ని ఆన్లైన్ కార్యక్రమాలను సమగ్రంగా చర్చించేందుకు ఇతోధికంగా పరిశోధన చేయవలసి ఉంది. వ్యాసపరిమితి దృష్ట్యా కేవలం ఒకటి రెండు అంశాలను మాత్రమే ఈ వ్యాసం స్పృశించింది. విశాఖజిల్లాలో మిగతా సాహితీసంస్థలు, ఉభయతెలుగురాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అసంఖ్యాకసాహిత్యసంస్థలు ఆన్లైన్ వేదికగా గడిచిన మూడేళ్ళలో భాషా, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలలో విశేషకృషి చేసాయి. ఈ అంశంపై విశ్వవిద్యాలయస్థాయిలో పరిశోధనలు  జరగాల్సి ఉంది. ప్రపంచవ్యాప్త సాహితీసంస్థల అంతర్జాలసమావేశాల కృషిని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించి గ్రంథస్థం చేయాలి.

6. ఉపయుక్తవిషయసూచి:

  1. ముఖాముఖి: వెంకటేశ్వర్లు, మెరుగుమిల్లి. విశాఖ జిల్లా అధ్యక్షులు, ఆంధ్రపద్యకవితాసదస్సు. 01.02.2023 (లింక్)

అంతర్జాలవనరులు:

  1. ఆంధ్రపద్యకవితాసదస్సు - సాహిత్యోపన్యాసం., (Zoom) అంశం: శ్రీపతిశతకం గ్రంథావిష్కరణసభ, తేది:15.10.2021., https://www.youtube.com/watch?v=n_ClByyhwZo మరియు ప్రబంధ చమత్కారాలు-1. వక్త: డా. మెరుగుమిల్లి వేంకటేశ్వరరావు, తేది:24.10.2021 (గూగుల్ మీట్). శ్రీకాళహస్తి మాహాత్మ్యం – జనజీవనం, వక్త: డా. లింగాల యాజ్ఞవల్క్యశర్మ. తేదీ: 31.10.2021.
  2. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, అంశం: శ్రీనాథుని భక్తి - పోతన రక్తి, తేది: 11.2021., https://youtu.be/niwNEXpmlhc
  3. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం, వక్త: తొలి అచ్చ తెలుగు అవధాని, కుదురాటగండ, కళారత్న, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాదు గారు, అంశం: నీలపెళ్ళి - అచ్చ తెలుగు వెలుగు. తేది:  11.2021., https://youtu.be/bI7HoGw5q9E
  4. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం, వక్త: అవధాని శ్రీమతి బులుసు అపర్ణ, ద్వారకా తిరుమల., అంశం: ప్రహ్లాద చరిత్రము, తేది: 11.2021, https://youtu.be/9SooOGoTKIU
  5. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: అవధాని శ్రీ తాతా సందీప్ శర్మ, రాజమహేంద్రవరం., అంశం: హరవిలాస గౌరీకళ్యాణం, తేది: 28.11.2021, https://youtu.be/trKXK5ObjKY
  6. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: అవధాని శ్రీ పైడి హరనాథారావు గారు, శ్రీకాకుళం., అంశం: వసుచరిత్ర - శ్లేష వైభవం, తేది: 12.2021. https://youtu.be/ZbDyg-GZi28
  7. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: డా. పసుపులేటి రామచంద్రరావు, తాడేపల్లిగూడెం., అంశం: ముకుందమాల - భక్తి తత్త్వం, తేది: 12.2021. https://youtu.be/oWIYyV_Y4J4
  8. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: డా. డి. పార్వతీదేవి, కర్నూలు., అంశం: భాస్కరరామాయణం - సీత మండోదరి, తేది: 12.2021. https://youtu.be/TOqNFPZ1jOc
  9. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీ నందివెలుగు ముక్తేశ్వర రావు IAS (Rtd), అంశం: అక్షరమోహనాస్త్రం - నీల మోహనం, తేది:  12.2021., https://youtu.be/-sD6RdzTjwc
  10. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీ బులుసు వేంకట సత్యనారాయణ మూర్తి, కళాగౌతమి, రాజమండ్రి. , అంశం: తెలుగు, కన్నడ భారతాలలో - విరాటపర్వం, తేది:  02.01.2022., https://youtu.be/f-rh3L-HP3E
  11. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శతావధాని డా. పోచినపెద్ది సుబ్రహ్మణ్యం గారు, అంశం: శతకవైభవం, తేది:  23.01.2022. https://youtu.be/4NIgoktJa6M
  12. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: డా. జోస్యుల కృష్ణబాబు గారు, అంశం: కాళ్ళకూరి నారాయణరావు - నాటకత్రయం, తేది: 01.2022., https://youtu.be/xY9YpsXPZV4
  13. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీ దోనెపూడి నరేశ్ బాబు గారు, అంశం: శ్రీ మాధవపెద్ది, బుచ్చిసుందరరామశాస్త్రి విరచిత మృత్యుంజయశతక సౌందర్యం, తేది: 06.02.2022., https://youtu.be/tynt6C6VX7I
  14. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీ జెట్టి యల్లమంద గారు, అంశం: గుఱ్ఱం జాషువా - స్మృతి కవిత్వం తేది: 13.02.2022., https://youtu.be/jAkzhm-DHzM
  15. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీ కొరుప్రోలు గౌరినాయుడు (కాకినాడ) గారు, అంశం: వేటూరి ప్రభాకర శాస్త్రి-వాఙ్మయవరివస్య, తేది: 20.02.2022., https://youtu.be/XsBoYhM3LFc
  16. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: డా. పోతేపల్లి బాల దుర్గా వరప్రసాదు గారు, అంశం: అచ్చతెలుగు అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాదు - సారస్వతవైభవం, తేది: 27.02.2022., https://youtu.be/aFAgC3TZNns
  17. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: డా. ఈరంకి వెంకట సత్య నాగ మురళీధర్ గారు, అంశం: దక్షిణాంధ్రయుగం - పద్యవైచిత్రి, తేది: 06.03.2022., https://youtu.be/eihPWQUjBs4
  18. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: అవధాని డా. గంగుల నాగరాజు గారు, అంశం: శ్రీకృష్ణ నిర్యాణం - పాండవనిర్వేదం, తేది: 13.03.2022., https://youtu.be/a73k38a1CYM
  19. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీమతి చలసాని లక్ష్మీ కాత్యాయని గారు, అంశం: శ్రీనాథుని చాటువులు, తేది: 20.03.2022., https://youtu.be/0uDeupswvm0
  20. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీమతి తట్టా జానకి గారు, అంశం: శ్రీపతి శతకం - దశావతార వర్ణనలు తేది: 27.03.2022. https://youtu.be/ISMuzEpCErU
  21. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు, అంశం: విశ్వనాథ భావుకత తేది: 03.04.2022., https://youtu.be/EVwB9J3PLug
  22. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీ కాకరపర్తి దుర్గాప్రసాద్ గారు, అంశం: ధూర్జటి - పద్యమాధురీమహిమ తేది: 10.04.2022., https://youtu.be/tDl2g35XhbE
  23. ఆంధ్ర పద్యకవితా సదస్సు - శ్రీరామపాదుకాపట్టాభిషేకము పుస్తకావిష్కరణ., కవులు : యువశతావధానిత్రితయ ప్రణీతం అంశం: E-Book పుస్తకావిష్కరణ - శ్రీరామపాదుకాపట్టాభిషేకము, తేది: 15.04.2022., https://youtu.be/d6Gz6VRuNCo
  24. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీమతి వాసా రమణి గారు, తుమ్మపాల., అంశం: వామనచరిత్ర తేది: 17.04.2022., https://youtu.be/obCrYJJXH1g          
  25. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: డా. ప్రసాదరావు గోగినేని గారు, అమెరికా., అంశం: పెద్దన కవిత్వం - శిరీషకుసుమపేశలం, తేది: 24.04.2022., https://youtu.be/1PcB49BsjE4
  26. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: కె. శోభ గారు, అంశం: ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు, తేది: 01.05.2022. https://youtu.be/pzHMF3lHIl0
  27. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం.. అంశం: కావ్యగాన సభ, తేది: 15.05.2022. , https://youtu.be/mswrDjTQtYA
  28. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: డా. పేరి రవికుమార్ గారు, అంశం: ఆముక్తమాల్యద - అనన్యకృతి ప్రబంధము, తేది: 22.05.2022., https://youtu.be/lVnYiSTPdcc
  29. ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం., వక్త: శ్రీమతి గడియారం గాయత్రి గారు, అంశం: పోతనకవి గజేంద్రమోక్షణము, తేది: 12.05.2022., https://youtu.be/-k8Qc8SgVDU

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "April-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-March-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "APRIL-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]